ఏపీ తీరమంతా పర్యాటకకేంద్రంగా.. విదేశీయులపై బాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటకానికి పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోచిస్తున్నారు. ఇందులో భాగంగానే పర్యాటకరంగంపై మేధోమథనం చేస్తున్నారు. రాష్ట్రానికి సువిశాల సముద్ర తీరం ఉన్నందున ఆ మొత్తం తీరాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం విశాఖ బీచ్ ప్రధాన బీచ్గా ఉండగా, మచిలీపట్నం బీచ్ కూడా స్థానిక టూరిస్టులను ఆకర్షిస్తోంది.
అదే తరహాలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని తీరాన్ని పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు బాబు ఆలోచన చేస్తున్నారు. దీనిపై అధికారులతో ఆయన మంగళవారం సమీక్షించారు. పర్యాటక రంగం ద్వారా భారీగా దేశ, విదేశీయులను ఆకర్షించి, ఆదాయాన్ని పెంచుకునే దిశగా కసరత్తు చేస్తున్నారు. దీనివల్ల రాష్ట్ర అభివృద్ధిలో పర్యాటక రంగం ఒక చోదక శక్తిగా మారేలా కూడా చూడవచ్చునని ఆయన భావిస్తున్నారు.
అంతేకాకుండా ఉపాధి అవకాశాలను కూడా మెరుగుపరిచేందుకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. త్వరలో మరోసారి భేటీ అయి పర్యాటక రంగ అభివృద్ధిపై బాబు చర్చించనున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఉన్న అనేక ప్రముఖ దేవాలయాలను కూడా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే అంశాలను ఆయన పరిశీలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ప్రారంభించనున్న సీ-ప్లేన్ సర్వీసులపై ముంబయి నుంచి వచ్చిన మెయ్ఎయిర్ ఆపరేటింగ్ సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది.
వీలైనంత త్వరగా సీ-ప్లేన్ సర్వీసులను ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించాలని చంద్రబాబు ఆపరేటింగ్ సంస్థను కోరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలోనే రానున్నాయి. పర్యాటకాన్ని ప్రాధాన్యరంగంగా గుర్తించి తగిన ప్రోత్సాహం అందించడం ద్వారా ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతాయన్న అభిప్రాయం సమావేశంలో ప్రధానంగా వ్యక్తమైంది. రాష్ట్రంలోని దేవాలయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం, విజయవాడ ఇంద్రకీలాద్రి, పంచారామాలు, అన్నవరం, సింహాచలం వంటి దే వాలయాలకు ప్రత్యేక ప్యాకేజీలను తయారు చేయాలని అధికారులను కోరారు. ఇక, శ్రీకాకుళం బారువా నుంచి విశాఖపట్నంలోని బీచ్లతోపాటు కాకినాడ, కృష్ణా జిల్లాలోని హంసలదీవి, నెల్లూరు జిల్లా మైపాడు బీచ్ వరకు బీచ్లను ఆకర్షణీయంగా తయారు చేయాలని వాటికి సంబంధించి బడ్జెట్లో ప్రాధాన్యత నిస్తామని చంద్రబాబు అధికారులకు చెప్పారు.