కేసీఆర్కు ఝలక్ ఇద్దాం: పొన్నాల లక్ష్మయ్య
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీపై మరోసారి టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలకు భ్రమలు కల్పించి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కేసీఆర్ ప్రస్తుతం ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్దితుల్లో లేరని అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పినందుకు తల ఎన్నిసార్లు నరుక్కుంటారో ఆయనకే తెలియాలని పొన్నాల అన్నారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్కు ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు నిరాశ నిస్పృహల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేసీఆర్కు ఝలక్ ఇవ్వాలని ప్రజలనుద్దేశించి అన్నారు.
కేసీఆర్ తీరుతో హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతిందని ఆయన అన్నారు. ఎస్సీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్..ఆ మాట తప్పి మోసం చేశారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైద్రాబాద్ లోని పార్టీ నేతలకు, కార్యకర్తలకు నిర్వహించిన సమావేశంలో డిఎస్ పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో అందరూ సమసన్వయంతో పనిచేసి, పార్టీ గెలుపుకు కృషి చేయాలని సూచించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇంఛార్జీ దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు. జలవిహార్ లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఆయన గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుకోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ కొన్ని సాంప్రదాయాలకు కట్టుబడి పనిచేస్తోందని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని గుర్తు చేశారు దిగ్విజయ్ సింగ్.