కరీంనగర్ అసెంబ్లీ సీటు: ముగ్గురి మధ్య హోరాహోరీ
కరీంనగర్ పట్టణం, మండలంలో విస్తరించిన అసెంబ్లీ నియోజకవర్గంలో పట్టణ ఓటర్ల సంఖ్య అధికంగా ఉండడంతో వారి మద్దతు ఎవరికి దక్కుతుందన్న దానిపై ఫలితం ఆధారపడి ఉంటుంది. పట్టణంలో ముస్లింలు, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు అధికంగా ఉండగా, వైశ్యులు, ఎస్సీలు, పద్మశాలీల ఓట్లు కూడా జయాపజయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
గత ఎన్నికల్లో మహా కూటమి మద్దతుతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన గంగుల కమలాకర్ 32 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరోసారి ఇక్కడ విజయం నమోదు చేసేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్ తమకే దక్కుతుందనే ధీమాతో ఆయన ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ఈసారి తనకు విజయాన్ని అందిస్తుందని న్యాయ శాఖ మాజీ మంత్రి చల్మెడ ఆనందరావు కుమారుడు లక్ష్మీనర్సింహారావు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ముస్లింల మద్దతును ముందే కూడగట్టుకున్న చల్మెడ వ్యాపార వర్గాల మద్దతు కూడా పొందారు. లోక్సభ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ స్థానికుడే కావడంతో రెండు ఓట్లు కాంగ్రెస్కే పడేలా చేస్తున్న ప్రచారం తమకు లాభిస్తుందని భరోసా వ్యక్తం చేస్తున్నారు.
2005లో కార్పొరేటర్గా గెలుపొందిన సంజయ్ గడిచిన తొమ్మిదేళ్లలో పార్టీపరంగా చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యేలా ప్రయత్నాలు చేపట్టారు. తెలంగాణ ఏర్పాటులో సహకరించిన పార్టీగా సెంటిమెంటు తమకు కూడా కలిసి వస్తుందని, టిడిపితో పొత్తు లాభిస్తుందని భావిస్తోంది. సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగర్రావు లోక్సభ అభ్యర్థిగా ఉండటం కూడా కలిసి వస్తుందని ఆశాభావంతో ఉంది. ఈనెల 22న నరేంద్ర మోదీ బహిరంగసభతో బీజేపీకి మరింత అనుకూల వాతావరణం ఏర్పడవచ్చని అంచనా వేస్తోంది.