'పవన్ కళ్యాణ్లాంటి ఆంధ్రావాళ్లు చెప్తే, ఇక మీరెందుకు'
హైదరాబాద్: ఆంధ్రా నేతలు వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెబితే జగ్గారెడ్డికి బీజేపీ టిక్కెట్ ఇచ్చిందని, ఇక బీజేపీలో తెలంగాణ నేతలు ఉండి ఏం ప్రయోజనమని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు శనివారం ధ్వజమెత్తారు. గూండాలకు, రౌడీలకు బీజేపీ టిక్కెట్లు ఇస్తోందని తెరాస నేతలు రాములు నాయక్, ఎర్రోళ్ల శ్రీనివాస్లు అన్నారు. తెలంగాణ వ్యతిరేగి జగ్గారెడ్డిని మెదక్ లోకసభ అభ్యర్థిగా పార్టీ ఎలా ప్రకటించిందో చెప్పాలన్నారు.
మరోవైపు, మెదక్ లోకసభ ఉప ఎన్నికల్లో ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతవడం ఖాయమని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట, మిరుదొడ్డిలలో జరిగిన సమావేశాలలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట అసెంబ్లీ సెగ్మెంట్లో గత నాలుగుసార్లు ఎన్నికల్లో ప్రత్యర్ధుల డిపాజిట్లు గల్లంతు చేసి ప్రజలు తెలంగాణ ఉద్యమకారులకే పట్టం కట్టారని కొనియాడారు. అదే లోక్సభ ఉప ఎన్నికలో పునరావృతం అవుతుందన్నారు.
అందరూ కలిసికట్టుగా ముందుకు సాగి మెదక్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి కొత్త ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీగా గెలిపించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేశామన్న బీజేపీ మెదక్ ఉప ఎన్నికలకు సమైక్యవాదమని చెప్పుకున్న తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డికి టికెట్ ఇవ్వడంతో వారి వైఖరి బయట పడిందన్నారు. తెలంగాణ ద్రోహికి బీజేపీ టికెట్ ఇచ్చిన కిషన్రెడ్డిది సమైక్యవాదమా, తెలంగాణవాదమా ప్రకటించాలని సవాల్ చేశారు.
బీజేపీలో తెలంగాణ ఉద్యమ కార్యకర్తలు లేరా అని ప్రశ్నించారు. మెదక్లో జరిగిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. సంగారెడ్డి ప్రాంతాన్ని హైదరాబాద్లో లేదా బీదర్లో కలపాలని, తనకు మెదక్ జిల్లాతో ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించిన జగ్గారెడ్డికి గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంతంలో కరెంటు కష్టాలు చంద్రబాబు సృష్టేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆరోపించారు.
తట్టెడు బొగ్గులేని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయ డం వల్లే తెలంగాణ ప్రాంతంలో చీకటి అలుముకుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014ను ఉల్లంఘించి తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన 6700 మెగావాట్ల విద్యుత్కు కోత పెట్టిందన్నారు.
మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికతోనే బీజేపీ నిజస్వరూపం బయటపడిందని మార్కెటింగ్ శాఖ మంత్రి హారీశ్ రావు అన్నారు. శనివారం గజ్వేల్లో ఆయన మాట్లాడుతూ అసలు బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలని, పోలవరం ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపినందుకా, హైద్రాబాద్పై గవర్నర్గిరీ పెట్టినందుకా, చంద్రబాబు తొత్తుగా మారినందుకా ఎందుకు తెలంగాణ ప్రజలు ఓటేయ్యాలని ప్రశ్నించారు.