'ఏపీలో మావాళ్ల విగ్రహాలు పెడ్తారా': పేరుమార్చిన బాబు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో గల ట్యాంక్బండ్ పైన ఉన్న విగ్రహాల మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్యల పైన ఆంధ్రప్రదేశ్ నేతలు, విపక్ష నేతలు మండిపడిన విషయం తెలిసిందే. దీని పైన తెరాస నేత వేణుగోపాల చారి స్పందించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టడం సరికాదన్నారు. తాము తెలంగాణ నేతల విగ్రహాలను పంపిస్తామని, కృష్ణా బ్యారేజీ పైన పెడతారా అని ప్రశ్నించారు.
నగరంలోని ట్యాంక్బండ్పై ఉన్న సీమాంధ్ర ప్రముఖల విగ్రహాలు అవసరం లేదని కేసీఆర్ అనటం సరికాదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్రావు అభిప్రాయపడ్డ విషయం తెలిసిందే. ఉన్న విగ్రహాలు తొలగించకుండానే కొత్త విగ్రహాలను నెలకొల్పాలని కాంగ్రెస్ పార్టీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. పలువురు నేతలు కేసీఆర్ పైన విమర్సలు గుప్పించారు. ఈ నేపథ్యంలో వేణుగోపాల చారి పైవిధంగా స్పందించారు.
వాటర్ గ్రిడ్ పైన కేసీఆర్
వాటర్ గిర్డి పైన త్వరలో హెలికాప్టర్ ద్వారా సర్వే చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనికోసం రెండు నెలల్లో టెండర్లను పిలిచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్లలో 24 గ్రిడ్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వాటర్ గ్రిడ్ పైన సోమవారం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.
ఒక్కో వ్యక్తికి రోజుకు గ్రామాల్లో వంద లీటర్లు, పట్టణాల్లో 150 లీటర్లు అందించడమే తమ లక్ష్యమని కేసీఆర్ తెలిపారు వాటర్ గ్రిడ్ల నిర్మాణానికి రూ.27వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. మున్సిపాలిటీలకు, పరిశ్రమలకు ఈ గ్రిడ్ల ద్వారానే నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. దీనికోసం మొత్తం లక్షా 26వేల 36 కిలోమీటర్ల మేర పైపులైన్లు నిర్మిస్తామన్నారు.
5,527 కిలోమీటర్ల మేర ప్రధాన పైప్లైన్, ప్రధాన కాల్వ నుండి గ్రామాలకు 45,809 కిలోమీటర్ల మేర పైప్ లైన్, గ్రామాల నుండి ఇంటింటికీ75 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మించాల్సి ఉంటుందన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ద్వారానే పైపులైన్ నిర్మించనున్నట్లు చెప్పారు.
తెలంగాణకు 80 టీఎంసీల నీరు అవసరమని చెప్పారు. రాబోయే 30 ఏళ్ల అవసరాలు తీర్చేలా వాటర్ గ్రిడ్ నిర్మిస్తామన్నారు. 365 రోజులు తాగునీటి అవసరాలు తీర్చేలా జలాశయాల్లో డెడ్ స్టోరేజీ లెవల్స్ నిర్వహించాలన్నారు. జిల్లాలు, మండలాల వారీగా కాంటూర్లను గుర్తించాలన్నారు. కాగా, నల్గొండ జిల్లా నుండి వాటర్ గ్రిడ్ ప్రారంభఇంచాలని సీఎం భావిస్తున్నారు.
రాజీవ్ యువశక్తి పథకం పేరు మార్పు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజీవ్ యువశక్తి పథకం పేరును సీఎంఈవై (ముఖ్యమంత్రి యువ సాధికారత)గా మార్చింది. అక్టోబర్ 2న విజయవాడలో జన్మభూమి-మా ఊరు పథకాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారు. అదే రోజు నుండి పించన్ల పెంపు కూడా అమల్లోకి రానుంది. కాగా, ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పేరును మార్చిన విషయం తెలిసిందే.