పొన్నాలకు దమ్ముందా, దామోదర చెప్తారా: ఈటెల
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై, తెలంగాణ కాంగ్రెసు ప్రచార కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహపై తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, శాసనసభ్యుడు ఈటెల రాజేందర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. జలయజ్ఞాన్ని ధనయజ్జంగా మార్చిన ఘనత అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యదేనని ఆయన ఆరోపించారు.
సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జలయజ్ఞం పేరిట జరిగింది ముమ్మాటికి ధనయజ్ఞమేనని ఆయన అన్నారు. కష్ణా, గోదావరి నీటిని తెలంగాణకు తెచ్చే ధైర్యం పొన్నాలకు లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పొతిరెడ్డిపాడు అక్రమ ప్రాజెక్ట్ను ఆపేస్తారా, పోలవరం ఆపే దమ్ముందా? అని ఈటెల పొన్నాలను ప్రశ్నించారు.
అభివద్ధిపై పొన్నాల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నాయని, ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు టెంట్ తీసుకెళ్తే కనీసం టెంట్ తిరిగి ఇప్పించలేని ఘనులు ఈ కాంగ్రెస్ నాయకులని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటర్లగానే చూసింది తప్ప వారి అభివృద్ధికి ఏనాడూ పాటుపడలేదని ఈటెల వ్యాఖ్యానించారు.
కెసిఆర్పై విమర్శలు చేస్తున్న దామోదర రాజనరసింహ దళితులకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ సాధనకోసమే పుట్టిన ఏకైక పార్టీ తెరాస అని, తెలంగాణ పునర్నిర్మాణం కూడా తమ పార్టీతోనే సాధ్యమని ఆయన చెప్పుకున్నారు. ఎన్నికల సమయంలో నేతలు పార్టీలు మారడం సహజమేనని, వివేక్ సోదరులు పార్టీని వీడినంత మాత్రాన ఆ ప్రభావం తమ పార్టీపై చూపదని ఆయన అన్నారు.