రేవంత్ టార్గెట్, ఆంధ్రలో దమ్ముందా: తెరాసకు వివేకానంద
హైదరాబాద్: శాసనసభలో తెలుగుదేశం నుంచి ఎదుర్కొనే శక్తి లేకనే తెరాస ప్రభుత్వం తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఏడు రోజుల పాటు సస్పెన్షన్ చేశారని తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య, వివేకానందలు విమర్శించారు. బుధవారం సభా వాయినాదంతరం టీడీపీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
డీఎల్ఎఫ్కు సంబంధించి వాస్తవాలు బయటకు వస్తే తెరాసపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్న భయంతోనే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తెరాసకు దమ్ముంటే ఆంధ్రాలో పోటీ చేసి ప్రతిపక్ష పార్టీగా ఏర్పడాలని సవాల్ విసిరారు. తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జూపల్లి కృష్ణారావు చరిత్ర జిల్లా ప్రజలకు తెలుసున్నారు.
తెలుగుదేశం పార్టీ సభ్యులు మాట్లాడుతున్నపుడే అడ్డుకునేందుకు అధికార పార్టీ సభ్యులు ప్రయత్నిస్తున్నారన్నారు. వాస్తవాలు తెలపకుండా తమపై ఎదురు దాడి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో టీడీపీని శత్రుపక్షంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మంత్రి పదవులు ఆశించి తెరాస ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని సైలెన్స్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
మజ్లిస్ ఒత్తిడి మేరకే ప్రభుత్వ నిర్ణయాలు: లక్ష్మణ్
మజ్లిస్ పార్టీ ఒత్తిడి మేరకే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు.
గురువారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. మజ్లిస్ ఎమ్మెల్యేలతో చర్చించే మెట్రో రైలు మార్గంలో మార్పులను ఎల్ అండ్ టీకి ప్రభుత్వం సూచించిందని, ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్నారు. సాగర్లో వినాయక నిమజ్జనం మార్పుపై ఆలోచించాలని, దీని వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశముందన్నారు.
టీ ఫండ్ తరలించికుపోయే యత్నం: నాయిని
తెలంగాణ రాష్ట్ర ఫండ్ను ఆంధ్రప్రదేశ్ తన ఖాతాలోకి మళ్లించిందని, ఇక్కడి ఫండ్స్ను ఆంధ్రాకు తరలించుకు పోయే ప్రయత్నం చేసిందని, దానిని తాము అడ్డుకున్నామని హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. బ్యాంక్ ఖాతాలు సీఎస్ స్తంభింప చేశారన్నారు.