మీరేనట: పద్మకి ఝలకిచ్చిన రేవంత్, సరైన మొగుడని
హైదరాబాద్: తెలంగాణ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిల మధ్య బుధవారం ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి తరఫున నామినేషన్కు హాజరైన రేవంత్ రెడ్డితో కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఉండగా ఉపసభాపతి అక్కడకు వచ్చారు.
అభివాదాల అనంతరం.. స్టార్ కంపెయినర్ మీరేనట కదా అని రేవంత్ రెడ్డితో పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఉపసభాపతిగా ఉన్న మీరే రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు కదా.. మా అభ్యర్థి కోసం తాము ప్రచారం చేయాలిగా అని ధీటుగా సమాధానమిచ్చారు.
జగ్గారెడ్డే: రేవంత్
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పైన మరోసారి విరుచుకుపడ్డారు. నిజాయతీగా ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రక్కనబెట్టి తనకు కోట్ల రూపాయలు ఇచ్చినవారికే ఎన్నికల్లో కేసీఆర్ టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఇందుకు మెదక్ జిల్లాలోనే గతంలో బీబీ పాటిల్ ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఉదాహరణలని ఆయన వివరించారు.
మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాల్లో తిరుగుతూ కేసీఆర్ బండారాన్ని బయటపెడతానన్నారు. టీఆర్ఎస్ నేతల ఆగడాలను అడ్డుకునేందుకు మెదక్ లో కేసీఆర్కు మొగుడు లాంటి జగ్గారెడ్డిని బీజేపీ-టీడీపీ కూటమి అభ్యర్థిగా నిలబెట్టామన్నారు. కేసీఆర్ ఇటీవల సింగపూర్ వెళ్లింది, సింగారించుకోవడానికేనని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాద్ను కేసీఆర్ సింగపూర్ చేయలేరని, అయితే హైదరాబాద్ను అమ్మి సింగపూర్ను కొనగల సత్తా ఆయనకు ఉందని చురకలంటించారు.