సీమాంధ్ర లోకసభ: జగన్, బాబుల మధ్య టగ్ ఆఫ్ వార్
హైదరాబాద్: రానున్న సార్వత్రిక ఎన్నికలలో సీమాంధ్ర ప్రాంతంలో ఉన్న అన్ని లోకసభ నియోజకవర్గాలలోను హోరాహోరీ తప్పదా అంటే అవుననే అంటున్నారు. రాష్ట్ర విభజన, వైయస్ మృతి, పెద్ద ఎత్తున నేతలు పార్టీలు మారడం, అభ్యర్థులు మరో స్థానాలకు బదలీ కావడం... ఇలా పలు కారణాల వల్ల దాదాపు అన్ని నియోజకవర్గాలలోను హోరాహోరీ ఉందంటున్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికలలో అధికారం చేజిక్కించుకోవడానికి టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతో పాటు అత్యధిక లోకసభ స్థానాలను గెలుచుకోవాలని వారు అహర్నిషలు కృషి చేస్తున్నారు. ఈ దిశలో అభ్యర్థులను, స్థానిక నాయకులను పురమాయిస్తున్నారు.
టిడిపి, బిజెపి పొత్తుతో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, కాంగ్రెసు పార్టీలు ఒంటరిగా ఎన్నికలకు పోతున్నాయి. సీమాంధ్రలో ప్రధానంగా టిడిపి, జగన్ పార్టీల మధ్యనే పోటీ నెలకొంది. పలు సర్వేలలో టిడిప బలం క్రమంగా పుంజుకుంటున్నట్లుగా, జగన్ పార్టీ బలహీనపడుతున్నట్లుగా తేలుతోంది.
తాజాగా ఆజ్ తక్ సర్వేలో... రాష్ట్రంలో బిజెపి-టిడిపి కూటమి 17-21 స్థానాలు గెలుచుకుంటుందని, జగన్ పార్టీ 7-11 సీట్లు గెలుచుకుంటుందని వెల్లడైంది. కాంగ్రెసు సీమాంధ్రలో రెండు లేదా మూడు మాత్రమే గెలుచుకుంటుందని గత సర్వేలు చెప్పాయి. ఈ సర్వేలను బట్టి చూస్తే కాంగ్రెసు, జగన్ పార్టీల కంటే టిడిపి-బిజెపి కూటమి ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే పోటీ హోరా హోరీ ఉంటుందని మాత్రం రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
మొత్తం 25 లోకసభ నియోజకవర్గాల్లో ఒక్క కర్నూలులోనే కాంగ్రెస్కు బలమైన అభ్యర్ధి ఉన్నారని అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డితో జగన్ పార్టీ, టిడిపి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మిగతా చోట టిడిపి-బిజెపి కూటమి, జగన్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందంటున్నారు.
విశాఖపట్నం లోకసభ సీటు నుంచి విజయమ్మ పోటీచేస్తుండగా, ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పురంధేశ్వరి రాజంపేటకు వెళ్లారు. జగన్ పులివెందుల, చంద్రబాబు కుప్పం నుంచి పోటీలో ఉన్నారు. ఇది ఆయా పార్టీల లోకసభ అభ్యర్థులకు కలిసి వచ్చే అవకాశం.
విజయనగరం లోకసభకు బొత్స ఝాన్సీ బరిలో ఉన్నారు. బొత్సకే ఎదురు గాలి వీస్తోందని, ఈ నేపథ్యంలో విజయనగరంలో జగన్ పార్టీ, టిడిపిల మధ్యే హోరా హోరీ అంటున్నారు. రాజమండ్రి లోకసభ స్ధానం నుంచి మురళీ మోహన్ రెండోసారి టిడిపి తరఫున నామినేషన్ వేశారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు.
నర్సాపురం, ఏలూరు లోకసభ సీట్ల నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధులను జగన్ పార్టీ బరిలో నిలిపింది. నర్సాపురం సీటు నుంచి బిజెపి నుంచి గోకరాజు గంగరాజు, ఏలూరు నుంచి మాగంటి బాబు గట్టి పోటీని ఇస్తున్నారు. విజయవాడ నుండి టిడిపి తరఫున కేశినేని నాని, జగన్ పార్టీ నుండి కోనేరు ప్రసాద్ను ఢీ కొంటున్నారు. ఇక్కడ దేవినేని అవినాష్ కాంగ్రెస్ నుంచి గట్టి పోటీనే ఇస్తున్నారు.
నర్సరావుపేట బరిలో టిడిపి తరఫున రాయపాటి సాంబశివ రావు, జగన్ పార్టీ తరఫున అయోధ్య రామిరెడ్డి నిలిచారు. బాపట్లలో కాంగ్రెస్ అభ్యర్ధి పనబాక లక్ష్మి మరోసారి గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఒంగోలు నుంచి టిడిపి అభ్యర్ధిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి, జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మధ్య పోటాపోటీ ఉంది.
అనంతపురంలో టిడిపి అభ్యర్ధి జెసి దివాకర్ రెడ్డి, జగన్ పార్టీ అభ్యర్ధి అనంత వెంకట్రామిరెడ్డిలు బరిలో నిలిచారు. కర్నూలులో ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. జగన్ ఇలాకా కడపలో ఆయన సోదరుడు అవినాష్ రెడ్డి టిడిపి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు.