సహజీవనం: ప్రియుడిపై టీవీ యాంకర్ మళ్లీ.. కేసు ట్విస్ట్
హైదరాబాద్: తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి, సహజీవనం చేసి మోసం చేశాడని నెల రోజుల క్రితం ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీవీ యాంకర్... తాజాగా తన మాజీ ప్రియుడి పైన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను చేసిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని మాజీ ప్రియుడు తనను బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు.
అతను సాఫ్టువేర్ ఇంజనీర్. సమాచారం మేరకు... కొద్ది రోజుల క్రితం అతను బాధితురాలైన టీవీ యాంకర్ను, కేసు గురించి చర్చించుదాం రమ్మని పిలిచాడు. అతను కేసు విషయమై మాట్లాడుతూ.. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తనను బెదిరించాడని ఆమె ఆరోపిస్తున్నారు. అతను పలుమార్లు తనను బెదిరించాడని ఆరోపించారు.
దీంతో ఆమె బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు బుక్ చేశారు. తాము దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు, తాను టీవీ యాంకర్ను బెదిరించలేదని అతను చెబుతున్నాడు. తన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.
తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి, సహజీవనం చేసి, మోసం చేశాడని పోయిన నెల సదరు టీవీ యాంకర్ ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం అతను మరో యువతితో పెళ్లికి సిద్ధమైన సమయంలో పోలీసులకు పట్టించారు. పోలీసులు అతనినిని వైజాగ్లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతను బెయిల్ పైన విడుదలయ్యారు. దీంతో, కేసును ఉపసంహరించుకోమని అతను తనను బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేశారు.