డబుల్ గేమ్, జగన్తో మోడీ చేతులు: బాబుకు షాక్, కొర్రీ
హైదరాబాద్: తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పొత్తులో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు! నర్సీపట్నం, విశాఖపట్నం లోకసభ సీట్లను బిజెపి బలహీన అభ్యర్థులకు ఇచ్చిందని, వాటితో పాటు మరికొన్ని సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచే స్థితిలో లేరని, వారిని ఎట్టి పరిస్థితుల్లో మార్చాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పట్టుబడుతున్నారు. టిడిపి, బిజెపి పొత్తులో కొత్తగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు అనూహ్యంగా తెర పైకి వచ్చింది.
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ సన్నిహితుడు అదానీ... వైయస్ జగన్తో భేటీ అయ్యారట. ఇది చంద్రబాబును ఆగ్రహానికి గురి చేస్తుందంటున్నారు. ఇప్పటికే పలు సీట్లలో బిజెపి బలహీన అభ్యర్థులను నిలబెట్టిందని టిడిపి అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. దీనికి తోడు మోడీ సన్నిహితుడు జగన్తో భేటీ కావడాన్ని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు.
లోపాయకారి ఒప్పందమా?
సీమాంధ్ర ప్రాంతంలో బిజెపి వైయస్ జగన్తో లోపాయకారి ఒప్పందం ఏమైనా చేసుకుందా అనే అనుమానాలను పలువురు టిడిపి నాయకులు వ్యక్తం చేస్తున్నారట. నర్సీపట్నంలో మొదటి నుండి అనుకున్న రఘురామ కృష్ణం రాజును కాకుండా గోకరాజు రంగరాజును నిలబెట్టడం, విశాఖలో టిడిపికి బలం ఉన్నప్పటికీ.. పట్టుబట్టి ఆ స్థానాన్ని తీసుకొని కంభంపాటి హరిబాబును నిలబెట్టడంపై టిడిపి వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
జగన్తో ఒప్పందం వల్ల... బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి లబ్ధి చేకూర్చేలా బిజెపి చేస్తోందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే నిజమైతే సీమాంధ్ర ప్రాంతంలో టిడిపి - బిజెపి కూటమికి ఏడెనిమిది లోకసభ స్థానాలు, ఇరవై నుండి ముప్పై అసెంబ్లీ స్థానాలు మైనస్ అవుతాయని, అదే సమయంలో జగన్ పార్టీకి అవి ప్లస్ అవుతాయని లెక్కలు వేస్తున్నారట. మోడీ సన్నిహితుడు అదానీ.. జగన్తో భేటీ కావడాన్ని కూడా వారు ప్రశ్నిస్తున్నారంటున్నారు.
ఇదంతా చంద్రబాబుకు అసహనం, ఆగ్రహాన్ని తెప్పిస్తుందని చెబుతున్నారు. టిడిపి - బిజెపి కూటమితో ఇరు పార్టీలకు లబ్ధి జరగాలే తప్ప ఇతర పార్టీలకు లబ్ధి జరిగితే ఎలా అని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు పొత్తు ఏం లాభమంటున్నారు. బిజెపి నిలబెట్టిన అభ్యర్థులతో పలు నియోజకవర్గాల పైన ఇరు పార్టీలకు నష్టమే తప్ప లాభం లేదంటున్నారు. అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లోను మార్చవలసిందేనని చెబుతున్నారు.
బిజెపి బలహీనమైన అభ్యర్థులనే బరిలో దింపాలనే పట్టుదలకు పోతే సీమాంధ్ర ప్రాంతంలో ఒంటరిగా పోటీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. టిడిపి స్వతంత్రంగా పోటీ చేస్తే మరో ఇరవై అసెంబ్లీ స్థానాలు ప్లస్ కావడంతో పాటు ఇరవై వరకు లోకసభ సీట్లు గెలవడం ఖాయమని టిడిపి వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పి.. పొత్తు వద్దని ఒత్తిడి తెస్తున్నాయట.
బిజెపి ఏడెనిమిది అసెంబ్లీ స్థానాలను వదులుకోవాలని లేదా స్నేహపూర్వక పోటీకి దిగాలని టిడిపి చెబుతోంది. బలహీన అభ్యర్థులు, జగన్తో భేటీ తదితర బిజెపి వ్యవహారాలు బాబుకు ఆగ్రహం తెప్పిస్తున్నాయట. అయితే, బిజెపి మాత్రం టిడిపి వాదనను కొట్టిపారేస్తోంది. అయితే, పొత్తు విషయంలో ఇంత రగడ కొనసాగుతున్నప్పటికీ.. ఇరు పార్టీల నేతలు మాత్రం ఇలాంటి సమస్యలు సాధారణమేనని, పొత్తు కొనసాగుతుందని చెబుతుండటం గమనార్హం. పొత్తు రగడ నేపథ్యంలో ప్రకాశ్ జవదేకర్ హైదరాబాదుకు చేరుకున్నారు. చంద్రబాబు కూడా రానున్నారు. వారు అన్నింటిపై చర్చించనున్నారు.
కుదరకుంటే అన్ని స్థానాల్లో బిజెపి
తాము పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని టిడిపి పట్టుబడితే అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు ఎపి బిజెపి సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన జాబితాను కంభంపాటి హరిబాబు ఢిల్లీ పెద్దలకు పంపించారు. జాబితాలోని అభ్యర్థులకు సిద్ధంగా ఉండాలని ఫోన్లు చేశారని సమాచారం.
జాబితాలో వీరే...
విజయవాడ - పొట్లూరి వర ప్రసాద్
మచిలీపట్నం - ఎర్నేని సీతాదేవి లేదా తుమ్మల ఆంజనేయులు
గుంటూరు - మాదాల శ్రీనివాస్
నరసారావుపేట - విష్ణు
ఏలూరు - కోటగిరి శ్రీధర్
విజయనగరం - సన్యాసి రాజు
రాజమండ్రి - ఆకుల సత్యనారాయణ
రాజంపేట - పురంధేశ్వరి