బాబుతో ట్విట్టర్ ఇండియా చీఫ్, వనరుల కోసం కమిటీ
హైదరాబాద్: ట్విట్టర్ ఇండియా హెడ్ ఆర్ఎస్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును గురువారం కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఎలా చేరువ కావాలనే అంశం పైన వారు చర్చించారు. ప్రజలకు చేరువయ్యేందుకు ఇటీవల సామాజిక వెబ్సైట్లను ప్రభుత్వాలు ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే.
ఆదాయ వనరుల కమిటీ చీఫ్గా సుజనా చౌదరి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదాయ వనరులను సమీకరించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎంపీ సుజనా చౌదరి అధ్యక్షతన ఆదాయ వనరుల కమిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఆలోచించి ఖర్చు పెట్టండి!
విభజన తర్వాత లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ తన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఆర్థిక క్రమశిక్షణపై దృష్టి పెట్టిన ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు, మంత్రులకు ప్రతీ పైసా ఆలోచించి ఖర్చు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభ్వుత్వ శాఖలు పాటించాల్సిన పది పొదుపు సూత్రాలు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉద్యోగులు, మంత్రులు ఫైవ్స్టార్ హోటళ్లలో ఎట్టిపరిస్థితుల్లోను సమావేశాలు నిర్వహించకూడదని, విమానాల్లో మంత్రులు, కేబినెట్ హోదా కలిగిన ఇతరులు కేవలం ఎకానమీ క్లాస్లోనే ప్రయాణించాలని, కొత్త వాహనాలను కొనుగోలు చేయరాదని, అంతగా అవసరమైతే తాత్కాలికంగా అద్దె వాహనాలు వాడుకోవాలని, ప్రతీ శాఖలోనూ అత్యవసరమైతే తప్ప కొత్త ఉద్యోగాలను కల్పించరాదని, ఉన్నవారినే సర్దుబాటు చేసుసోవాలని, మంత్రులు, ఉన్నతాధికారులు విలాసాలు, విదేశీ యాత్రలు పూర్తిగా తగ్గించాలని పేర్కొన్నారట.
హైకోర్టు కోసం తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఆందోళన
తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించారు. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలన్నారు.