హత్య కేసుల్లో దంపతుల అరెస్టు (ఫొటోలు)
విశాఖపట్నం: ఒంటరిగా ఉన్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని గత మే, జులై నెలల్లో జరిగిన రెండు హత్య కేసుల్లో నిందితులైన దంపతులను విశాఖపట్నం సిసిఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారిని రిమాండ్కు తరలించారు. వారి నుచంి 163 గ్రాముల బంగారు ఆభరణాలను, రెండు పల్సర్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసు కమిషనరేట్లో బుధవారంనాడు క్రైమ్ డిసిపి టి. రవికుమార్ మూర్తి మీడియా సమావేశంలో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన గొల్లపల్లి నాగమల్లేశ్వర రావు అలియాస్ రాజు అలియాస్ ఎన్ఎం రావు 8వ తరగతి వరకు చదువుకున్నాడు. ఏలూరు గవర్నమెంట్ ఆస్పత్రిలో మేల్ నర్స్గా ఉన్న అతని తండ్రి వద్ద సహాయకుడిగా పనిచేసేవాడు.
అదే ప్రాంతానికి చెందిన ఎం. రామలక్ష్మి అలియాస్ బంగారం ఆస్పత్రి వద్ద టెలిఫోన్ బూత్ నిర్వహించేది. వారిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఎస్టీడీ బూత్ తీసేయగా ఆమె కనిపించకుండా పోయింది. నాగమల్లేశ్వరరావుకు 2008లో విజయవాడకు చెందిన విజయకుమారితో వివాహం జరిగింది. అంతలోనే రామలక్ష్మి అతనికి తారసపడింది. వారిద్దరు హైదరాబాద్ వెళ్లిపోయారు.
మొదటి భార్య కేసు పెట్టడంతో ఇద్దరు హైదరాబాద్ నుంచి విశాఖకు మకాం మార్చారు. విశాఖలోని ఓ ప్రకృతి వైద్యశాలలో నాగమల్లేశ్వర రావు పనిచేశఆడు. హెచ్బి కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఫిజియోథెరపి, మసాజ్ పేరిట ప్రచారం ప్రారంభించాడు. తర్వాత రవీంద్రనగర్ ఆఖరి బస్టాప్ ప్రాంతానికి మకాం మార్చాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఒంటరిగా ఉన్న వృద్ధులను లక్ష్యం చేసుకుని ఆరోలవ, పెదగదిలి ప్రాంతాల్లో ఇరువురు బైక్పై తిరిగారు.
గుణం కృష్ణవేణి అనే వృద్ధురాలి ఇంటికి వెళ్లి అద్దెకు ఇల్లు మాట్లాడి రూ.2 వేలు అడ్వాన్స్గా ఇచ్చారు. సాయంత్రం మత్తు మందు కలిపిన చెరుకు రసం తీసుకుని వచ్చి ఆమెకు ఇచ్చారు. చెరుకు రసం తాగిన ఆమె స్పృహత తప్పి పడిపోయింది. ఆమె ఒంటి మీద ఉన్న నగలను తీసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత నాగమల్లేశ్వర రావు పిఎంఆర్ సెంటర్ వద్ద రెడ్ పల్సర్ దొంగిలించాడు.
ఆ బైక్పై ఉరువు ఆరిలోవ వెళ్లి ఇల్లు అద్దెకు కావాలంటూ మరో వృద్ధురాలిని సంప్రదించారు. ఆమెను మాటల్లో పెట్టి ఇంట్లోకి తీసుకుని వెళ్లారు. నోట్లో గుడ్డలు కుక్కి ప్రాణాలు తీశారు. ముక్కు, చెవులకు ఉన్న బంగారు నగలు తీసుకుని పారిపోయారు. వారం రోజుల తర్వాత పెదగంట్యాడ, నెల్లముక్కలో ఇదే విధంగా బొట్టా మహాలక్ష్మి అనే వృద్ధురాలిని చంపి బంగారు ఆభరణాలు దొంగిలించారు.