మనస్పర్థలు: కాలువలో దూకి ప్రేమ జంట ఆత్మహత్య
ప్రియుడితో తగాదాల కారణంగా ఎస్సారెస్పి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు డిఎస్పి దక్షిణమూర్తి వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. హన్మకొండలోని ఎన్జివోస్ కాలనీకి చెందిన శ్రీవిద్య, వరంగల్ శంభునిపేటకు చెందిన ఎండి అతీఖ్ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి మధ్య వారం రోజులుగా తీవ్ర మనస్పర్థలు చోటు చేసుకోవడంతో ఇద్దరు కలిసి శుక్రవారం మధ్యాహ్నం చింతగట్టు వద్ద కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు.
అతీఖ్ మృతికి శ్రీవిద్యే కారణమని అతని తండ్రి రఫీక్ ఫిర్యాదులో పేర్కొన్నారని డిఎస్పి దక్షణమూర్తి తెలిపారు. శ్రీవిద్య నిత్యం అతీఖ్కు ఫోన్ చేసి గంటల తరబడి మాట్లాడేదని, ఆమె వేధింపులతోనే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు. శ్రీవిద్యను కళాశాలలో ర్యాగింగ్ చేసి హత్య చేశారని ఆమె తండ్రి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని డిఎస్పి చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని, వారి ఉజ్వల భవిష్యత్తుకు జాత్రగత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
కాగా, శ్రీవిద్య, అతీఖ్ మధ్య మూడేళ్ల క్రితం నుంచి ప్రేమ వ్యవహారం కొనసాగుతున్నట్లు సమాచారం. పదో తరగతి చదువుతున్న సమయంలోనే వీరిద్దరికి నగరంలో నిర్వహించిన సైన్స్ఫేర్లో పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఆ పరిచయమే ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరు ఒకే కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంజినీరింగ్ విద్య కోసం కిట్స్ కళాశాలలో చేరారు. ప్రేమ వ్యవహారంలో చోటు చేసుకున్న మనస్పర్థల కారణంగానే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.