ఆడిపోసుకుంటున్నారు: టిఆర్ఎస్పై ఏపి మంత్రి ఉమా
ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్న విధంగానే నడుచుకుంటున్నామని ఆయన చెప్పారు. అపెక్స్ కౌన్సిల్, కేంద్ర జల సంఘం ఆమోదం తర్వాతే నూతన ప్రాజెక్టులు నిర్మించాలని అన్నారు. అపెక్స్ కమిటీలో తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు, ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు సభ్యులుగా ఉంటారని చెప్పారు. అపెక్స్ కమిటీలో సభ్యుడిగా ఉన్న కెసిఆర్ మాట తప్పుతున్నారని అన్నారు. తెలంగాణ మంత్రి హరీశ్ రావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని అన్నారు.
కేంద్ర జల సంఘం ఆమోదం తర్వాత కొత్త ప్రాజెక్టులు అమల్లోకి వస్తాయని ఉమామహేశ్వరరావు తెలిపారు. అనవసరంగా తెలంగాణ ప్రభుత్వం, టిఆర్ఎస్ నాయకులు తమను ఆడిపోసుకుంటున్నారని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా చేసి ఆయన దారిన ఆయన పోయారని అన్నారు.
ఇప్పుడు కెసిఆర్ జలయజ్ఞంతో ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఉమా మహేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతుల హక్కులను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.