'6వేల సంవత్సరాల జైలుశిక్ష, అందరి చూపు జగన్వైపు'
హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు విధించిన శిక్ష, జరిమానాలతో పోలిస్తే.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంద్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆరువేల అరవై సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఆదివారం అన్నారు.
వైయస్ జగన్ పదవులకు రాజీనామా చేయాలని టీడీపీ ఏపీ కార్యదర్శి వర్ల రామయ్య డిమాండ్ చేశారు. జయలలితకు కోర్టు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఏపీలో అందరి చూపు జగన్ వైపు మళ్లిందన్నారు. జయలలిత కన్నా జగన్ పైన ఎక్కువ ఛార్జీషీట్లు దాఖలయ్యాయని తెలిపారు. ఎక్కువ సెక్షన్లు కూడా నమోదయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నేళ్లు శిక్ష పడుతుంది, ఎన్ని కోట్ల జరిమానా విధిస్తారు, భవిష్యత్తు ఏమవుతుందని ఆలోచిస్తున్నారన్నారు.
కేవీపీ మాటేమిటి?
జయలలిత కంటే ముందు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు జైలుకు వెళ్ళాలని ఏఐసీసీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంత రావు అన్నారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఆత్మ పేరిట కేవీపీ కోట్లాది రూపాయలు సంపాదించారని విహెచ్ ఆదివారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. అమాయకుడైన పొన్నాల లక్ష్మ య్య బండారం బయటపెడతానంటూ తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి వ్యాఖ్యానించడాన్ని ఖండించారు.
కేవీపీ అక్రమ ఆస్తుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. అక్రమ మైనింగ్, నీటి పారుదల రంగాల్లో కేవీపీ ప్రమేయం ఉందన్నారు. వైయస్ బతికి ఉంటే జైలుకు వెళ్ళాల్సి వచ్చేదన్నారు. కేవీపీ పైన లోగడ సీబీఐ చేపట్టిన దర్యాప్తు ఏమైందన్నారు. జగన్ జైలుకు వెళ్ళి కొంతకాలానికి బెయిల్ తెచ్చుకున్నారని, అమెరికాకు సంబంధించిన ఒక కేసులో కేవీపి అరెస్టుకు ఇంటర్పోల్ ఆర్డర్ ఉన్నా స్టే తెచ్చుకున్నారన్నారు.