జగన్పై వర్ల ఫైర్, ఎందరో కేవీపీలు: కేసీఆర్పై నర్సిరెడ్డి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ జైలుకు వెళ్లివచ్చినా మారలేదని, క్రిమినల్ మైండ్తోనే ఆలోచిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య శనివారం ఆరోపించారు. సాక్షి పత్రిక అసత్య రాతలతో చంద్రబాబుపై బురద జల్లుతోందన్నారు.
చంద్రబాబు ఇవ్వని హామీలను కూడా ఆయన చెప్పినట్టు చిత్రీకరిస్తున్న సాక్షిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయనున్నామన్నారు. దేశంలో ఏ రాజకీయనేత సాహసించని రీతిలో చంద్రబాబు రూ.45 వేల కోట్ల మేర రైతుల రుణాలు మాఫీ చేశారన్నారు. ఇది జగన్ తట్టుకోలేకపోతున్నారన్నారు. ఈడీ కేసులో జగన్ మరోసారి అరెస్టయ్యే అవకాశం ఉందన్నారు. రుణమాఫీపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు.
కేసీఆర్ పైన నర్సిరెడ్డి
వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా కేసీఆర్ పాలన సాగిస్తున్నారని తెలంగాణ టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి వేరుగా అన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల్లో చెప్పిన కేసీఆర్ అధికారంలోకి రాగానే విద్యార్థులకు లాఠీదెబ్బ రుచి చూపిస్తున్నారని మండిపడ్డారు. వైయస్ పాలనకు కొనసాగింపుగా కేసీఆర్ పాలనలో బెదిరింపులు, దౌర్జన్యాలు, పత్రికల పైన ఆంక్షలు, పేదల ఇళ్ల కూల్చివేతలు సాగుతున్నాయన్నారు.
వైయస్ పాలనలో ఒక కేవీపి ఉంటే.. ఇప్పుడు డజన్ల కొద్ది కేవీపీలు తయారయ్యారన్నారు. తెలంగాణలో పుట్టిన బిడ్డలకు ఫీజు రీయింబర్సుమెంట్స్ పైన ఆంక్షలు విధించడం దుర్మార్గమన్నారు. హైదరాబాదులో అక్రమ కట్టడాల పేరుతో పేదల ఇళ్లను కూల్చుతున్నారే తప్ప.. వివేకానంద రెడ్డి, మహీధర్ రెడ్డి, సంతోష్ రెడ్డిల ఇళ్లను ఎందుకు కూల్చడం లేదన్నారు. అక్రమ నిర్మాణాలకు సహకరించిన వారిపై చర్యలకు ప్రభుత్వానికి దమ్ముందా అని సవాల్ విసిరారు.