పవన్ ఇంటర్వ్యూ:రామోజీకి వాసిరెడ్డి నిలదీత, నిప్పులు
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముసుగు తొలగిపోయిందని, దిగజారుడు రాజకీయాలకు ఆయన ఆది గురువు అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మంగళవారం మండిపడ్డారు. ఈనాడులో పవన్ ఇంటర్వ్యూ వచ్చింది. ఈ విషయమై వాసిరెడ్డి పద్మ ఈనాడు, పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గొంతును పవన్ అద్దెకు తెచ్చుకున్నారని విమర్శించారు. ప్రజలను నేరుగా చంద్రబాబు ఓట్లు అఢగలేక.. ఓ పక్క మోడీని, మరోపక్క పవన్ ముసుగు పెట్టుకున్నారన్నారు.
చంద్రబాబును విమర్శించనందుకే.. పవన్కు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని వాసిరెడ్డి మండిపడ్డారు. ఎల్లో మీడియా సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోందన్నారు. వార్తల పేరిట ఈనాడు సొంత కథనాలు అల్లుతోందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు శిఖండులే అన్నారు. సామాన్య ప్రజలు ఆలోచించినట్లుగా కూడా పవన్ ఆలోచించలేకపోతున్నారన్నారు. పవన్ ఒక పక్కకు ఒరిగిపోయిన చంద్రబాబుకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.
2009లో శత్రువు అయిన చంద్రబాబు ఇప్పుడు మిత్రుడిగా మారిపోయారా అని పవన్ను ప్రశ్నించారు. చంద్రబాబు గెలుపు ఈనాడుకు, ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణలకు అవసరమన్నారు. ముఖ్యమంత్రి పీఠంపై ఇక కూర్చోలేనని చంద్రబాబుకు తెలుసునని, అందుకే వెనుక నుండి వీరంతా చక్రం తిప్పుతున్నారన్నారు. చంద్రబాబును అడ్డం పెట్టుకొని తమ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని చూస్తున్న వారు ఆయన గెలుపు కోసం ఆరాటపడుతున్నారని ఆరోపించారు.
చంద్రబాబును కుర్చీలో కూర్చుండబెట్టాలన్న ఆరాటం ఈనాడు ప్రతి అక్షరంలో కనిపిస్తోందన్నారు. మోడీని ఆకాశానికి ఎత్తాలని ఈనాడు రామోజీరావుకు ఇప్పుడే ఎందుకు అనిపిస్తోందన్నారు. బాబు, బిజెపిల బంధం కుదిరిన తర్వాత మోడీని ఆకాశానికి ఎత్తాలని ఈనాడు చూస్తోందన్నారు. మోడీ గెలుపు చారిత్రక అవసరమని అంతకముందు ఎప్పుడు ఈనాడు ఎందుకు చెప్పలేదన్నారు.
ఈనాడులో మోడీ, పవన్ ఇంటర్వ్యూలు వచ్చాయన్నారు. పవన్ ఇంటర్వ్యూ కూడా గ్రాండ్ స్కీంలో భాగమన్నారు. చంద్రబాబు, పవన్ కాంబినేషన్లో ఓట్లు వస్తాయన్న ఆశతో పవన్ను ఈ నాడు ఆకాశానికి ఎత్తేస్తోందన్నారు. పవన్ కొత్తగా రాజకీయాల్లోకి రాలేదని, 2009లోనే ఆయన వచ్చారన్నారు. పవన్లో ఇన్ని గొప్ప లక్షణాలు అప్పుడు రామోజీ రావుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. పవన్ గొప్ప రాజకీయవేత్తలా ఈనాడుకు కనిపించడంలో ఆశ్చర్యం లేదన్నారు.
కొత్త పార్టీగా పవన్ వ్యాఖ్యలను తాము స్వాగతిస్తామని అయితే, చంద్రబాబు గొంతును పవన్ అద్దెకు తెచ్చుకున్నారని, పవన్ పరిజ్ఞానం ఏమిటో.. అవగాహన ఏమిటో ఇంటర్వ్యూలో చెప్పకనే చెప్పారన్నారు. జగన్ను ప్రత్యక్షంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక చంద్రబాబుకు ఇవాల పవన్ కావాలి, మోడీ కావాల్సి వచ్చిందన్నారు. రామోజీ రావుకు బాబు ముఖం ఒక్కటే సరిపోవడం లేదన్నారు.