న్యూయార్క్ స్థాయికి, బాధ: వెంకయ్య, హెచ్చరిక
విజయవాడ: భూముల ధర విషయంలో విజయవాడ.. న్యూయార్క్ స్థాయికి చేరుకున్నటుందని కేంద్రపట్టణాభివృద్ధి శాఖమంత్రి వెంకయ్య నాయుడు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. స్మార్ట్ సిటీలపై విజయవాడలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశాన్ని వెంకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.
విజయవాడ నగర పాలక సంస్థ దుస్థితి చూస్తే బాధ కలుగుతోందన్నారు. రెండు నెలలుగా ఉద్యోగులకు కనీసం జీతాలు ఇవ్వలేని దయనీయ స్థితిలో విజయవాడ నగర పాలక సంస్థ ఉందన్నారు. మెరుగైన పరిపాలన వ్యవస్థ లేకపోవడమే ఈ దుస్థితికి కారణమన్నారు. పన్నులు వేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలని నగరపాలక సంస్థకు పరోక్షంగా ఆయన సూచించారు.
ప్రభుత్వ వ్యవస్థలు సరిగ్గా పనులు చేస్తే ప్రజలు కచ్చితంగా పన్నులు కడతారన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే పన్నులు కట్టడానికి ప్రజలు వెనుకాడరన్నారు. సరైన ప్రణాళిక ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వీజీటీఎం మెట్రో రైలు తన కల అన్నారు. విజయవాడలో భూముల ధరల పెరుగుదలపై వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. అడ్డదిడ్డంగా ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచేసిన రియల్టర్లు కచ్చితంగా ఏదో ఒకనాడు బోర్లా పడతారని హెచ్చరించారు.
రాష్ట్రంలోని ప్రజలకు అంత కొనుగోలు శక్తి లేదని రియల్టర్లు తెలుసుకోవాలన్నారు.దళారుల మాయలో పడి భూముల కొనుగోలు విషయంలో ప్రజలు మోసపోవద్దన్నారు. శివరామకృష్ణన్ కమిటీ ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో భూముల ధరలకు ఇష్టం వచ్చినట్లు రెక్కలొచ్చేశాయని విమర్శించారు.