పోలవరం గ్రామాలే ముంచుతాయి: కాంగ్రెస్పై విద్యాసాగర్
హైదరాబాద్/తిరుపతి: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు విద్యాసాగర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపడమనే అంశమే కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమవుతుందని అన్నారు.
కేంద్రమంత్రి జైరాం రమేష్, పార్లమెంటు వ్యవహారాల మంత్రి కమల్నాథ్ చేస్తున్న ప్రకటనల వల్లే తెలంగాణ ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారని విద్యాసాగర్ రావు ఆరోపించారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని నియంత్రించేందుకు ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని విద్యాసాగర్ రావు కోరారు.
జగన్ తీరుపై మండిపడ్డ బిజెపి, తిరుమలలో ధర్నా
డిక్లరేషన్ ఫాం మీద సంతకం చేయకుండా చిత్తూరు జిల్లాలోని తిరుపతి వెంకటేశ్వర స్వాముల వారిని దర్శించుకున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. డిక్లరేషన్ ఫాం మీద సంతకం చేయకపోవడం, హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వరకు చెప్పులు వేసుకుని నడుచుకుంటూ వెళ్లడం హిందూ మత పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైయస్ జగన్కు అతి మర్యాదలు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు, జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బుధవారం తిరుమల కొండపై ధర్నా చేశారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే, సినీనటి జయసుధ కుటుంబ సమేతంగా తిరుపతి శ్రీవారిని దర్శించుకోవటానికి వచ్చినప్పుడు ఆమె కుటుంబ సభ్యులంతా హిందువులే అయినా డిక్లరేషన్ ఫాం మీద సంతకం లేనిది దర్శనానికి పంపించని టిటిడి అధికారులు, జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యవహరించిన తీరుపై బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జయసుధ, జగన్ల మధ్య వివక్ష ఎందుకని బిజెపి నేతలు ప్రశ్నించారు. టిటిడి అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జగన్ చేసిన తప్పిదానికి తక్షణం క్షమాపణ చెప్పాలని బిజేపి నేతలు డిమాండ్ చేశారు. ఇది ఇలావుండగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా జగన్ వివాదం గురించి నివేదిక సమర్పించాలని టిటిడి అధికారులను ఆదేశించారు.