గాంధీతో వద్దు, ఇబ్బంది పెట్టాడు: కెసిఆర్పై విజయశాంతి
వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావును జన్మలో కూడా జాతిపిత మహాత్మా గాంధీతో పోల్చొద్దని మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రముఖ నటి విజయశాంతి మంగళవారం అన్నారు. 2004లో తెలంగాణ ఇద్దామన్న సోనియా గాంధీని అడ్డుకుంది కెసిఆరేనన్నారు.
కెసిఆర్ను మహాత్మా గాంధీతో పోల్చడం సరికాదని, స్వాతంత్య్రం తెచ్చిన గాంధీ ప్రజల మనసుల్లో నిలిచాడన్నారు. కెసిఆర్ పొద్దున లేస్తే సమైక్యవాదుల, నాయకుల వద్ద వసూళ్లు చేసి ఆస్తులు సంపాదించుకుంటాడని ధ్వజమెత్తారు. తెరాసలో చేరిన కొద్దిరోజుల్లోనే తనను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారన్నారు.
కెసిఆర్ తీవ్రమైన పదవీకాంక్షతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లుందని, అందుకే మానసికంగా బలహీనపడిపోయి మతితప్పిన మాటలు మాట్లాడుతున్నారని టిపిసిసి అధ్యక్షులు చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. పిచ్చిపట్టినట్లుగా మాట్లాడుతోన్న కెసిఆర్ మానసిక స్థితి బాగవ్వాలని కోరుకుంటున్నాన్నారు. కత్తి, కట్టే.. ఈ రెండింటిని ఏ రకంగా వినియోగిస్తామో ఆ ప్రకారమే వ్యక్తిత్వం ఉంటుందని, కత్తి ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి మొనగాడు కాలేడన్నారు.
తాను ఏదైనా శాసిస్తానని విర్రవీగడం తెలివి తక్కువతనమేనన్నారు. మన బుర్ర ఎలా ఉంటే ప్రవర్తన, మాట అదే విధంగా ఉంటుందని, కాంగ్రెస్ వాళ్లు సన్నాసులు, నాలుక చీరేస్తాం అంటూ హద్దు మీరిన దూషణలు కెసిఆర్ ఆహానికి అద్దం పడుతున్నాయని మండిపడ్డారు. కెసిఆర్ భాష, వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.