రాములమ్మ బీజేపీలో చేరుతారా, కేసీఆర్ వైపు అరవింద్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న మాజీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి ఇటీవల కనిపించడం లేదు! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెరాసలో కీలకంగా ఉన్న ఆమె.. ఆ పార్టీ అధికారంలోకి వచ్చే సమయానికి కేసీఆర్తో విభేదాల కారణంగా కాంగ్రెసు పార్టీలో చేరారు. అయితే అనూహ్యంగా కాంగ్రెసు పార్టీ పరాజయాన్ని చవి చూసింది. కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తుందనే ఉద్దేశ్యంతోనే విజయశాంతి కాంగ్రెసు పార్టీలో చేరారని అంటారు. కాని అది రివర్స్ అయింది.
ఇప్పుడు ఆమె బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వినవస్తున్నాయి. కాంగ్రెసు పార్టీ సమీక్షా సమావేశాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. దీంతో ఆమె ఆ పార్టీకి దూరంగా జరుగుతున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. కేసీఆర్తో విభేదాలు, పోటీపై అసంతృప్తి తదితర కారణాలతో ఆమె 'చేయి' అందుకున్నారు. తెలంగాణ ఇచ్చినందున కాంగ్రెసు పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందనే ఉద్దేశ్యంతో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేశారట.
రాములమ్మ కాంగ్రెసు పార్టీలో చేరకముందు.. తమ పార్టీలోకి వస్తే మెదక్ పార్లమెంటు సీటు ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చిందట. అయితే, ఆ ఆఫర్ను విజయశాంతి తిరస్కరించారట. కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని భావించిన ఆమె.. ఎమ్మెల్యేగా కాంగ్రెసు పార్టీ నుండి గెలిచి రాష్ట్రంలో మంత్రి అవుదామని ఆలోచించారట. కానీ, ఇక్కడ కాంగ్రెసు పార్టీ గెలవలేదు. అంతేకాకుండా కేంద్రంలో బీజేపీ మెజార్టీ సాధించింది.
మరోవైపు, అరవింద్ రెడ్డి తెరాసలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారట. కేసీఆర్కు సన్నిహితంగా ఉండే అరవింద్ రెడ్డి విభజన కారణంగా కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన డిగ్గీ సమక్షంలో కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెసు పార్టీ వల్లే తెలంగాణ కల నెరవేరిందని, కేసీఆర్ వల్ల కాదని ఆయన విమర్శలు గుప్పించారు.
ఇప్పుడు కాంగ్రెసు పార్టీ ఎక్కడా అధికారంలో లేదు. దీంతో ఆయన తిరిగి తెరాసలోకి రావాలనుకుంటున్నారట. అయితే, అరవింద్ రెడ్డిని కేసీఆర్ పార్టీలో చేర్చుకుంటారా, చేర్చుకుంటే సరైన ప్రాధాన్యత ఇస్తారా అనే చర్చ సాగుతోంది. దాదాపు రెండు నెలలుగా ఆయన తెరాస నేతలతో టచ్లో ఉన్నారట.