వైరాగ్యం: విజయశాంతి ఓసేయ్ రాములమ్మ సీక్వెల్?
హైదరాబాద్: కె చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి దూరమైన కాంగ్రెసు అభ్యర్థిగా మెదక్ శాసనసభా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన తెలంగాణ రాములమ్మ విజయశాంతికి రాజకీయాలపై వైరాగ్యం వచ్చినట్లుంది. ఆమె చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ స్థితిలో ఆమె మళ్లీ సినిమాల వైపు చూస్తున్నట్లు వినికిడి.
లేడీ సూపర్ స్టార్గా, లేడీ అమితాబ్గా పేరు గడించిన విజయశాంతి ఓసేయ్ రాములమ్మ సినిమాకు సీక్వెల్ నిర్మించాలనే ఆలోచనలో ఉన్నారని ప్రచారం సాగుతోంది. తెలంగాణలోని ఓ దళిత మహిళపై జరుగుతున్న దౌర్జన్యాన్ని, ఆమె తిరుగుబాటును చిత్రీకరించిన సినిమా ఒసేయ్ రాములమ్మ.
ఓసేయ్ రాములమ్మ సినిమాకు దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు. దశాబ్దం పాటు తెలుగు సినిమాల్లో తిరుగులేని నాయికగా వెలుగొందిన విజయశాంతికి ఓసేయ్ రాములమ్మ ఘన విజయాన్ని సాధించిపెట్టింది. 1997లో వచ్చిన ఈ సినిమా 200 రోజులకు పైగా థియేటర్లలో ఆడింది.
ఈ సినిమాలోని నటనకుగాను ఆమెకు నంది అవార్డు, ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డు లభించాయి. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి పార్లమెంటులో కూడా అడుగు పెట్టిన విజయశాంతి రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉండి సినిమాల్లో తన సత్తాను మరోసారి చాటాలని నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.