మీ ఇంటి నిర్మాణమా: నన్నపనేనితో సిఆర్ వాగ్వివాదం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో శాసనమండలిలో తెలుగుదేశం సభ్యురాలు నన్నపనేని రాజకుమారి, కాంగ్రెసు సభ్యుడు సి. రామచంద్రయ్య మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎపి రాజధాని విషయంలో సోమవారం చర్చ సందర్భంగా ఇరువురి మధ్య ఘాటుగా మాటల యుద్ధం జరిగింది. రాజధాని ఏర్పాటు విషయాన్ని సభలో చర్చించుకుండా మంత్రివర్గ సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకోవడాన్ని సి. రామచంద్రయ్య తప్పు పట్టారు.
రాష్ట్ర విభజన అంశంపై కూడా మంత్రివర్గ సమావేశంలోనే చర్చించారని నన్నపనేని రాజకుమారి అన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎపి రాజధాని ఎక్కడనే విషయం చెప్పలేదని ఆమె గుర్తు చేశారు. రాజధాని ఏర్పాటు అనే విషయం మీ ఇంటి నిర్మాణమా, ఇటువంటి సున్నితమైన అంశంపై సభలో చర్చించరా అని రామచంద్రయ్య అడిగారు.
ఇరువురి మధ్య వాగ్వివాదం చెలరేగినప్పుడు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జోక్యం చేసుకున్నారు. రాజధాని ఏర్పాటుపై ఇంత రాద్ధాంతం ఎందుకని ఆయన అడిగారు. రాజధాని ఏర్పాటుపై జరిగే చర్చకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమాధానం ఇస్తారని ఆయన చెప్పారు. పూర్తిగా కసరత్తు చేసిన తర్వాతనే రాజధాని ఏర్పాటు ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని ఆయన చెప్పారు.
యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలను రామచంద్రయ్య తప్పు పట్టారు. విజయవాడకు సమీపంలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై మంగళవారంనాడు ప్రకటన చేయాలని అనుకున్నారు. కానీ, మంచిరోజు కాకపోవడంతో వెనక్కి తగ్గారు.