ఎపి, టీ మధ్య పవర్ వివాదం: కెసిఆర్పై టిడిపి ఆగ్రహం
హైదరాబాద్: విద్యుచ్ఛక్తి కొరతతో తెలంగాణ రాష్ట్రం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటోంది. హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రికి మంగళవారం కరెంట్ లేదు. దీంతో రోగులు నానా ఇబ్బందులు పడ్డారు. విజయవాడ, ముద్దనూరులోని రాయలసీమ థర్మల్ విద్యుచ్ఛక్తి కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరమ్మతు చర్యలు చేపట్టింది. దీంతో రోజుకు 20 నుంచి 25 మిలియన్ యూనిట్ల విద్యుచ్ఛక్తి సరఫరా ఆగిపోయింది.
మరమ్మతుల గురించి తమకు తెలియజేయలేదని తెలంగాణ విద్యుచ్ఛక్తి శాఖ అధికారులు నిందిస్తున్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలు లేకుండా ఆ రెండు కేంద్రాల్లో ఓవర్హాల్ కార్యక్రమాన్ని చేపట్టారని విమర్సిస్తున్నారు. నిజానికి, తెలంగాణ ప్రభుత్వం సింహాద్రి, రామగుండం ఎన్టీపిసి యూనిట్లకు తెలంగాణ ప్రభుత్వం బొగ్గు సరఫరా చేయడం లేదని, దాంతో ఆవి నిలిచిపోయాయని ఆంధ్రప్రదేశ్ అధికారులు నిందిస్తున్నారు.
తమను నిందించడానికి బదులు తెలంగాణ ప్రభుత్వం ఆ రెండు యూనిట్లకు బొగ్గు సరఫరా చేస్తే సరిపోతుందని, అవి పనిచేయకపోవడం వల్ల 500 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి నిలిచిపోయిందని ఆంధ్ర అధికారులు అంటున్నారు. అవి పనిచేసి ఉంటే రెండు రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉండేదని అంటున్నారు.
కాగా, తెలంగాణ ప్రభుత్వం ఇటీవలి 800 మెగావాట్ల కృష్ణపట్నం నుంచి విద్యుత్తు వాటాను అడుగుతోంది. ఈ మేరకు ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. కాగా, ప్రభుత్వ అనుమతితో మరమ్మతుల కోంస థర్మల్ యూనిట్లలో విద్యుదుత్పత్తిని నిలిపేసినట్లు ఎపిజెన్కో మంగళవారంనాడు ప్రకటన చేసింది. ఆ విషయం తమకు తెలియజేయలేదని తెలంగాణ అధికారులు అంటున్నారు.
ఇదిలావుంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ ఫేస్బుక్లో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీ వైఫల్యాలకు చంద్రబాబును నిందించడమేమిటని ప్రశ్నించింది. విద్యుత్ కోతపై ఆందోళనకు దిగిన ప్రజలపై లాఠీచార్జీ చేయడాన్ని నిరసించింది.