మేమిస్తామన్నామాట్లాడరేం: హరీష్కి దేవినేని, బాబు ఫైర్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలు రెండూ కలసి రైతుల కష్టాలను తీర్చాలని ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మంగళవారం విజయవాడలో అన్నారు. విద్యుత్ కష్టాల్లో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి తాము 300 మెగావాట్ల విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధమన్నారు. తాను తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని మండిపడ్డారు.
చంద్రబాబు దిష్టిబొమ్మలు, టీడీపీ కార్యాలయాలు ధ్వంసం చేస్తే విద్యుత్ రాదన్నారు. తెరాస నేతలు రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా జలాలను కాపాడుకుంటూ రైతులను ఆదుకోవాలన్నారు. పక్క రాష్ట్రాలు విద్యుత్ ఇస్తామంటున్నా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు.
తెలంగాణ రైతాంగాన్ని కాపాడేందుకు ఎంత విద్యుత్ కావాలో చర్చించుకొని ఇస్తామని కూడా ఆయన చెప్పారు. హరీష్ రావు నుండి తనకు ఎలాంటి సమాచారం రాలేదన్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న కేటీఆర్తో మాట్లాడినా స్పందించలేదన్నారు. జీవో 107, 69 కచ్చితంగా అమలు చేస్తామన్నారు.
చంద్రబాబు ఆగ్రహం
తెలంగాణలో కరెంట్ కష్టాలకు తానే కారణమని అంటున్న తెరాస ప్రభుత్వంపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. కృష్ణాజిల్లా పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ముందుచూపుతో విద్యుత్ కొనుగోలు చేయకుండా తనపై విమర్శలు చేస్తారా? అని ఆయన ధ్వజమెత్తారు.
పొందే హక్కు లేకపోయినప్పటికీ తెలంగాణలో 300 మెగావాట్ల విద్యుత్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఆయినా తనపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరితో ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతోందన్నారు.
విద్యుత్ విషయంలో తెలంగాణ కోసం కొంత త్యాగం చేస్తామని చెప్పామని, అయినా ఈరోజు టీడీపీ తప్పు చేస్తోందని తెలంగాణలో లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం టీడీపీ నేతలను కొంటున్నారని, అయినా పరవాలేదని ఒక్కడు పోతే వందమందిని తయారుచేస్తానన్నారు. ఏపీలో అన్నివిధాలా అభివృద్ధిపనులు నేను చేస్తుంటే, తెలంగాణలో మీరు చేసుకోలేక నన్ను విమర్శించడం సరికాదని హితవుపలికారు.