మా వల్ల కాదు!: ఫీజులపై సుప్రీం కోర్టుకు టీ ప్రభుత్వం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల ఫీజులు తాము ఎందుకు చెల్లించలేమని చెబుతున్నామో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనుంది. అలాగే తాము 1956ను కటాఫ్ తేదీగా ఎందుకు పెట్టామో కూడా చెప్పనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం.. ఎంసెట్ కౌన్సెలింగ్ను అక్టోబర్ వరకు పొడిగించాలని అపెక్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ కేసును సుప్రీం కోర్టు ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తాము ఎందుకు ఫీజులు చెల్లించలేమో తెరాస ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలియజేయనుంది.
ఫీజు రీయింబర్సుమెంట్స్ పథకం సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పథకమని, రాష్ట్ర విభజన నేపథ్యంలో.. విద్యార్థుల ఫీజులు చెల్లించలేని ఆర్థిక పరిస్థితి రాష్ట్రాల పైన ఉందని, ముఖ్యంగా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, వారి ఫీజులు చెల్లించే ఆర్థిక పరిస్థితి కొత్త రాష్ట్రానికి లేదని వారు సుప్రీం కోర్టుకు చెప్పనున్నారని తెలుస్తోంది.
అంతేకాకుండా ఫీజు రీయింబర్సుమెంట్స్లోని అవకతవకలను కూడా తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకు వెళ్లనుందని సమాచారం. ఈ కారణంగానే తాము ఫీజు రీయింబర్సుమెంట్స్ స్థానంలో 'ఫాస్ట్' (ఫైనాన్సియల్ అసిస్టెన్స్ ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ) పథకాన్ని ప్రవేశ పెట్టామని చెప్పనుందని తెలుస్తోంది. తెలంగాణ విద్యార్థులకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేందుకు ఈ పథకాన్ని తీసుకు వచ్చామని చెప్పనుంది. దీనికి కేసీఆర్ ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తోంది.