ప్రియుడిపై మోజు: భర్తను ముక్కలుగా కోసి, మూసీలో..
హైదరాబాద్: ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసింది. దాంతో ఆగకుండా తన భర్త మృతదేహాన్ని ముక్కలుగా కోసి, వాటిని మూసినదిలో పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన హైదరాబాదులోని ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు మంగళవారంనాడు వచ్చిన వార్తాకథనాల ప్రకారం ఇలా ఉన్నాయి.
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని చింతచెట్ల తండాకు చెందిన సైనావత్ చందు (36), శాంత భార్యాభర్తలు. దాదాపు 13 ఏళ్ల క్రితం వీరికి వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులున్నారు. కొన్నేళ్లుగా నగరంలోని బండ్లగుడా కృషినగర్లో ఉంటూ చందు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
గత మూడేళ్లుగా శాంత వ్యవహారం చందుకు నచ్చడం లేదు. దీంతో భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు అవుతుండేవి. ఈ క్రమంలో గత ఆగస్టు 17వ తేదీన ప్రియుడు గోపాల్తో కలిసి వారుండే గదిలోనే భర్తను శాంత హత్య చేసింది. మృతదేహాన్ని తరలించేందుకు మరో ఇద్దరిని పురమాయించి వారికి రూ.10 వేలు ఇచ్చింది.
భర్త మృతదేహాన్ని ముక్కలుగా కోసి రెండు గోనెసంచుల్లో నింపి నాగోల్ వంతెన సమీపంలోని మూసీనదిలో పడవేయించింది. అదే రోజు కొండ మల్లేపల్లిలో తన భర్త చందుకు చెందిన మరో సొంతింటికి కుమారులతో సహా వెళ్లింది. ఆ పక్కనే చందు సోదరులు సైతం ఉంటున్నారు. మరుసటి రోజు తెలంగాణ సర్వేలో చందు కనిపించకపోయే సరికి వారు ఆమెను అడిగారు. తనతో గొడవ పడి అతను ఎక్కడికో వెళ్లిపోయాడని చెప్పింది.
రోజులు గడుస్తున్నా చందు రాకపోయేసరికి సోదరులకు అనుమానం వేసింది. దీంతో ఈ నెల 17వ తేదీన చందు సోదరుడు శ్రీను తన వదినపై అనుమానం వ్యక్తం చేస్తూ దేవరకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. దాంతో ఆమె నేరాన్ని అంగీకరించింది.
దాంతో శాంతతో పాటు ఆమె ప్రియుడు గోపాల్ను, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూసీ ప్రవాహంలో మృతదేహం కోసం గాలించారు. నిందితులు చంపామని అంగీకరించినా మృతదేహం లభించకపోవడంతో హత్య విషయాన్ని నిర్దారించలేకపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.