కేసీఆర్కి సింగపూర్ ఆహ్వానం: ఏకైక సీఎం, పెట్టుబడులకి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వచ్చే నెలలో సింగపూర్ వెళ్లనున్నారు. ఆయనను ఐఐఎం పూర్వ విద్యార్థులు ఆహ్వానించారు. దేశంలోనే ఈ ఆహ్వానం అందుకున్న ఏకైక సీఎం కేసీఆర్. వివిధ దేశాల నుండి కార్యక్రమానికి హాజరయ్యే ఐఐఎం పూర్వ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాలని వారు కేసీఆర్ను కోరారు. దీంతో, సింగపూర్లో జరిగే ఇంపాక్ట్ 2014లో పాల్గొనేందుకు కేసీఆర్ వెళ్లనున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యులు, కార్పొరేట్ ప్రముఖలు, సింగపూర్ ప్రధానమంత్రి, ప్రభుత్వ అధికారులు హాజరయ్యే సమావేశంలో కేసీఆర్ వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణ అభివృద్ధి విజన్, పారిశ్రామిక రంగంలో తెలంగాణలో ఉన్న అవకాశాల గురించి వివరిస్తారు. ఆగస్టు 22,23 తేదీల్లో సింగపూర్లో ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ఆసియా వ్యాప్తంగా అభివృద్ధికి గల అవకాశాలపై చర్చిస్తారు.
దేశంలో ఈ ఆహ్వానం అందుకున్న తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ అని ఒక అధికార ప్రకటనలో తెలిపారు. సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు రెండు మూడు రోజుల పాటు సింగపూర్లో ఉండి అక్కడి ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక అభివృద్ధికి ఆ దేశం తీసుకున్న చర్యలను పరిశీలిస్తారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర వహించి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకు ముఖ్యమంత్రిని ఐఐఎం అలునీ అభినందించింది.
కొత్త రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పారిశ్రామిక విధానాలతో పాటు ఐఐఎం అలునీ ఎలాంటి పాత్ర పోషించాలనే అంశంపై ప్రధానంగా ప్రసంగించాలని సదస్సు నిర్వాహకులు ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణ అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రితో చర్చించేందుకు సిఈఓల బృందం సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
సింగపూర్తో పాటు ఆసియాలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, వివిధ రంగాల్లో అవకాశాలు, బిజినెస్ ఆలోచనలపై ఈ సదస్సులో చర్చిస్తారు. 2013లో ఏర్పాటు చేసిన సమావేశాలకు మంచి స్పందన లభించడంతో ఈసారి మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నారు. నూతన పారిశ్రామిక విధానాన్ని సింగపూర్ తరహాలో రూపొందిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పటికే సింగపూర్ మాడల్ను పరిశీలించారు. సింగపూర్ పర్యటనలో ఇప్పుడు స్వయంగా చూస్తారు. ప్రభుత్వంతో చర్చిస్తారు.
ఈ పర్యటనకు ముందే తెలంగాణ పారిశ్రామిక విధానం ఖరారవుతుందని, ఈ విధానాన్ని సింగపూర్లో ముఖ్యమంత్రి వివరిస్తారని ఒక అధికార ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో తీసుకురాదలచిన అవినీతి రహితమైన పారిశ్రామిక విధానాన్ని ఈ సదస్సు సందర్భంగా విస్తృతంగా ప్రచారం చేయనున్నట్టు తెలిపారు.
ముఖ్యమంత్రితో పాటు సిఎంఓ అధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటారు. బంగారు తెలంగాణ కల సాకారం చేసేందుకు నూతన పారిశ్రామిక విధానం పట్టుకొమ్మ అని కేసీఆర్ భావిస్తున్నారు. సింగపూర్ సదస్సును తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడులను ఆహ్వానించేందుకు అవకాశంగా తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.