ప్రియుడికి వేరే సంబంధం ఖాయమైందని.. టెక్కీ సూసైడ్
విజయవాడ: ప్రేమించిన వాడు తనను కాదని మరో యువతితో పెళ్లికి సిద్ధపడటాన్ని జీర్ణించుకోలేక బ్రాడిపేటకు చెందిన ఓ సాఫ్టువేర్ ఇంజనీర్ గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. బెంగళూరులో సాఫ్టువేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న స్రవంతి, యడ్లపాడు మండలం తిమ్మాపురంకు చెందిన రవికాంత్ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
స్రవంతిని పెళ్లి చేసుకుంటానని అతను చెప్పాడు. అయితే, రవికాంత్ తల్లిదండ్రులు అతడికి వేరే సంబంధాలు చూశారు. మరో సంబంధం కుదుర్చుకున్నారని స్రవంతి తెలుసుకుంది. శనివారం గుంటూరుకు వచ్చింది. ఆగస్టు ఒకటో తేదీ శనివారం రవికాంత్కు నిశ్చితార్థం ఉందని తెలుసుకున్న స్రవంతి తల్లి, పిన్నిలు తిమ్మాపురం వెళ్లారు.
ఆ సమయంలో రవికాంత్ లేడు. తమ అబ్బాయికి వేరే సంబంధం కాయమైందని వారు చెప్పారు. దీంతో గుంటూరు తిరిగి వచ్చిన స్రవంతి తల్లి జరిగిన విషయం కూతురుకు చెప్పింది. ప్రేమించిన తాను మోసపోయానని, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.
తన గదిలోకి వెళ్లిన స్రవంతి ఫ్యానుకు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి ఏడు గంటల సమయంలో తండ్రి వెళ్లి చూడగా కుమార్తె ఉరివేసుకొని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నారు.