ఏపి విద్యార్థికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ పురస్కారం(ఫొటో)
విశాఖపట్నం: శ్రీకాకుళం జిల్లా పలాస మండలం ఖాళీబుగ్గకు చెందిన ఐదో తరగతి విద్యార్థి విశాల్(10) తన జ్ఞాపక శక్తితో అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. అంతేగాక అనేక బహుమతులు కూడా గెలుచుకుంటున్నాడు. పలు చోట్ల ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకున్న ఈ బాల మేధావికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ వారు ప్రత్యేక బహుమతిని అందజేశారు.
ఈ మేరకు శుక్రవారం విజెఎఫ్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ యాజమాన్యం విశాల్కు ఆ పురస్కారాన్ని అందించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ ప్రతినిధులు నరేంద్ర గౌడ్, స్వర్ణశ్రీ మాట్లాడుతూ.. అతిచిన్న వయసులో విశాల్ లక్ష సంవత్సరాల క్యాలెండర్లో ఏ రోజు గురించి వివరాలు అడిగినా క్షణాల్లో సమాధానం చెబుతున్నాడని తెలిపారు.
అద్భుత ప్రతిభను సొంతం చేసుకున్న విశాల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు తోపాటు 11 విశిష్ఠ రికార్డులు సొంతం చేసుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. తల్లిదండ్రులు నాగేశ్వర రావు, హేమలత మాట్లాడుతూ.. విశాల్ ఆరో ఏట నుంచే ఎలాంటి చిక్కు సమస్య అడిగినా చెప్పేవాడని, అతని శ్రద్ధను గుర్తించి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చామని తెలిపారు.
మార్చి నెలలో నిర్వహించిన సూపర్ మెమొరీ కేటగిరిలో జాతీయ అవార్డును జస్టిస్ సుభాషణ్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడని, లక్ష సంవత్సరం క్యాలెండర్ రికార్డును డాక్టర్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నాడని చెప్పారు. ఆగస్టు 15న రాష్ట్ర ప్రభుత్వం అవార్డును మంత్రి అచ్చెన్నాయుడు చేతుల మీదుగా అందుకోవడం తమకు గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.