ఈసినే మోసం: జగన్పై యనమల, టిడిపిలో సీట్ల రగడ
హైదరాబాద్: నామినేషన్ దాఖలు సందర్భంగా ఎన్నికల కమిషన్కు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ను సమర్పించారని తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు శుక్రవారం ఆరోపించారు. ఈడి జగన్కు సంబంధించిన రూ.1011 కోట్లను జప్తు చేసిందని కానీ జగన్ తన ఆస్తులను వందల కోట్లలో మాత్రమే చూపారన్నారు. ఈసినే మోసగించిన జగన్కు రేపు ప్రజలను మోసం చేయడం పెద్ద కష్టమేమీ కాదన్నారు.
ప్రొద్దుటూరులో టిడిపి కార్యకర్తల ఆందోళన
కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో టిడిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రొద్దుటూరు అసెంబ్లీ స్థానానికి వరదరాజులురెడ్డికి కేటాయించడంపై సిట్టింగ్ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిడిపి జెండాలు తగులబెట్టి నిరసన వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లా తిరుపతి సీటును తనకు ఇవ్వనందుకు చదలవాడ కృష్ణమూర్తి అసంతృప్తితో ఉన్నారు. మాచర్ల సీటును స్థానికేతరులకు ఇచ్చారని స్థానిక తెలుగు తమ్ముళ్లు నిప్పులు చెరుగుతున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం టిక్కెట్ మృణాళికి కేటాయించడంపై అసంతృప్తి రాజుకుంది. నాలుగు మండలాల అధ్యక్షులు రాజీనామా చేసారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రత్యర్థిగా రేపు నామినేషన్ వేస్తానని మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. విశాఖపట్టణంలో ఆయన మాట్లాడారు. బిజెపితో టిడిపి పొత్తు తమకు కలసిరాదన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. బిజెపి, టిడిపి పొత్తు సాయంత్రానికి ఖరారవుతుందని అప్పుడు పూర్తి స్థాయి నిర్ణయం తీసుకుంటానని గంటా స్పష్టం చేశారు.