ఆ లక్షణాలు జగన్వే: యనమల, కర్నూలేనని కోట్ల
హైదరాబాద్: నరకాసుర వధ పేరుతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలను మూడ్రోజుల పాటు దగ్ధం చేస్తామన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
జగన్లో నరకాసురుడి లక్షణాలు ఉన్నాయి కాబట్టే ఆయనను ప్రజలు వద్దనుకున్నారని ఎద్దేవా చేశారు. రైతులు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయడం జగన్కు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పారు. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి రుణాలు మాఫీ చేయవద్దని కేంద్రానికి లేఖ రాశారన్నారు.
రుణమాఫీ అసాధ్యమని ఎన్నికల ప్రచార సమయంలో కూడా వైయస్ జగన్ ప్రచారం చేశారన్నారు. జగన్కు రైతుల రుణమాఫీ ఇష్టం లేనందునే అలా చేశారన్నారు. అలాంటి వ్యక్తికి రుణమాఫీ పైన మాట్లాడే హక్కు లేదన్నారు. జగన్ రైతు ద్రోహి అన్నారు.టీడీపీ రుణాలు మాఫీ చేస్తే రైతులు ఓటేయరని జగన్ భయపడుతున్నారని యనమల అన్నారు.
రుణమాఫీ చేయలేమని ఎన్నికల సమయంలో జగన్ చెప్పారన్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం రైతురుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయనుండటంతో... జగన్కు ఏం చేయాలో పాలుపోవడం లేదన్నారు. భవిష్యత్తులో తమ పార్టీకి ఓట్లు పడవని జగన్ భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. పేదలకు చెందిన లక్షలాది ఎకరాలను ధనవంతులకు ధారాదత్తం చేసిన ఘనత జగన్దే అన్నారు. 10 ఛార్జ్షీట్లలో జగన్పై 420 కేసులున్నాయన్నారు.
కర్నూలును చేస్తేనే: కోట్ల
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కర్నూలును చేస్తేనే న్యాయం జరిగినట్లు అవుతుందని మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వేరుగా అన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పూర్తి రుణాలను మాఫీ చేయాలని, అరకొర చేయడం సరికాదని ఆయన టీడీపీ ప్రభుత్వానికి హితవు పలికారు.