జగన్ ఆస్తులు రూ.416 కోట్లు, నో కారు: 10 ఛార్జీషీట్లు
కడప: పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు రూ.416 కోట్లు. ఆయనకు సొంత వాహనం లేదు. తన ఆస్తుల వివరాలను వైయస్ జగన్ అఫిడవిట్లో దాఖలు చేశారు.
తనకు లేదా తన భార్య వైయస్ భారతి రెడ్డికి సొంత వాహనాలు లేవని పేర్కొన్నారు. 2011 ఉప ఎన్నికల్లో తన ఆస్తులను రూ.445 కోట్లుగా వైయస్ జగన్ పేర్కొన్నారు. ఆస్తులలో రూ.344 కోట్లు తనవిగా, రూ.72 కోట్లు భారతివిగా తెలిపారు.
వివిధ సంస్థలలో తనకు రూ.307 కోట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. భారతికి రూ.46.56 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని చెప్పారు. భారతి వద్ద 9 కిలోల బంగారం, వజ్రాభరణాలు ఉన్నాయని, తన వద్ద రూ.28 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం రూ.13.90 కోట్లుగా ఉందని, భారతి ఆదాయం రూ.4.21 కోట్లుగా ఉందని చూపించారు.
రూ.3.94 కోట్ల సేవాపన్ను బకాయి ఉన్నట్లు తెలిపారు. రూ.66.68 కోట్ల ప్రభుత్వ బకాయిలపై వివాదం ఉన్నట్లు పేర్కొన్నారు. తన వద్ద రూ.39వేలు, తన భార్య భారతి వద్ద రూ.45వేల నగదు ఉందని చెప్పారు. తనపై 10 సిబిఐ ఛార్జీషీట్లు నమోదయ్యాయని, కమలాపురం కోర్టులోను ఓ కేసు విచారణలో ఉందని తెలిపారు. ఈడి కేసుతో పాటు మరో మూడు కేసులు ఎఫ్ఐఆర్ దశలో ఉన్నాయన్నారు.