ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 వల్లే: జగన్, బాబు మోసం..
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 మీడియా పైన మండిపడ్డారు. గుంటూరు జిల్లా ఎన్నికల ఫలితాల పైన ఆయన సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఓట్లు, సీట్ల కోసం అబద్దపు హామీలు ఇచ్చి ఉంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వచ్చి ఉండేదని వైయస్ జగన్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఏ గడ్డి అయినా తింటారన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 9లు ఒక్కటై ప్రచారం చేసి ఆయనను ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చుండబెట్టాయని విమర్శించారు. ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం ఇప్పుడిప్పుడే బయటపడుతోందన్నారు.
గ్రామాల్లో టీడీపీ నేతలు తిరిగే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదన్నారు. రుణాల విషయంలో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు రుణాలు, హామీలు, రాజధాని పైన రోజుకో మాట చెబుతున్నారని ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అందరి సలహాలు, సూచనలు అవసరమన్నారు.
పార్టీ శ్రేణులకు మనోధైర్యం కల్పించాలన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేశారు. తొలిరోజు సమావేశానికి గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, తాడికొండ, పొన్నూరు, తెనాలి, వేమూరు, రేపల్లె నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు.