బాబుకు నిజం తెలుసు, గతం వద్దు: హత్యలపై జగన్
హైదరాబాద్: శాంతిభద్రతల పైన శుక్రవారం అసెంబ్లీలో వాడిగావేడిగా చర్చ జరిగింది. వ్యవసాయ బడ్జెట్ అనంతరం శాంతిభద్రతల పైన చర్చకు సభాపతి కోడెల శివప్రసాద్ అనుమతి ఇచ్చారు. అధికార తెలుగుదేశం, ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య ఘాటైన చర్చ సాగింది.
హత్యా రాజకీయాలు సరికాదు: జగన్
హత్యా రాజకీయాలు సరికాదని జగన్ అన్నారు. మనిషిని ఖూనీ చేసే స్థాయికి రాజకీయ వ్యవస్థ దిగజారిందన్నారు. 14 మంది హత్యల పైన మాత్రమే చర్చ జరగాలని సభాపతిని కోరారు. గతంలోకి వెళ్లి ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అసెంబ్లీలో ఏం జరుగుతుందో రాష్ట్రం మొత్తం చూస్తుందన్నారు. అసెంబ్లీ ప్రారంభమయ్యేడప్పటికీ 11 మంది తమ పార్టీ కార్యకర్తలు చనిపోయారని, అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత మరో ఇద్దరు, ఈ రోజు పొద్దున్న మరొకరు చనిపోయారన్నారు.
మొత్తం 14మంది తమ పార్టీ వర్గీయులు టీడీపీ కార్యకర్తల దాడిలో చనిపోయారన్నారు. చర్చను తప్పుదోవ పట్టించేందుకే పరిటాల రవి హత్యను చర్చలో ప్రస్తావిస్తున్నారని ఆరోపించారు. పరిటాల రవికేసులో కోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చిందన్నారు. ఆ కేసులో దోషులకి ఇప్పటికే శిక్ష పడిందన్నారు. పరిటాల రవి హత్య విషయంలో నిజానిజాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుసునన్నారు. అందుకే జేసీ బ్రదర్స్ను టీడీపీలో చేర్చుకున్నారన్నారు.
బురద జల్లే యత్నం: దూళిపాళ్ల
గ్రామాల్లో జరిగి చిన్న చిన్న ఘటనలను భూతద్దంలో చూపించి ప్రభుత్వం పైన బురద జల్లేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రయత్నం చేస్తోందని టీడీపీ విప్ దూళిపాళ్ల నరేంద్ర అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య లేకపోయినా అనవసర రాద్దాంతం చేస్తున్నారన్నారు.