'జగన్ ఫెయిల్, మేమొస్తున్నాం': బాబుకి మాఫీ థ్యాంక్స్
విశాఖపట్నం: నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విఫలమైందని, ఇక తాము టీడీపీ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకు వెళ్లేందుకు సిద్ధమయ్యామని మాజీ మంత్రి బాలరాజు బుధవారం విశాఖలో అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టలేకపోతోందన్నారు.
తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీని ఎండగట్టేందుకు కాంగ్రెసు పార్టీ సిద్ధమైందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల్లో గిరిజనులకు ప్రాధాన్యత లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. విశాఖ కాంగ్రెసు నేతలు బాలరాజు నివాసంలో భేటీ అయ్యారు. ఈ నెల 27వ డీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉంటుంది. ఈ సమావేశానికి ఏపీసీసీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి రానున్నారు.
రుణమాఫీపై బాబుకు రైతులు, డ్వాక్రా మహిళల అభినందన
వ్యవసాయ రుణమాఫీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమను ఎంతో ఆదుకున్నారని గుంటూరు జిల్లా రైతు నేతలు బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. లేక్ వ్యూ అథిథి గృహంలో వినుకొండ నియోజకవర్గ రైతులు చంద్రబాబును కలిసి అభినందించారు. చంద్రబాబు చేసిన సహాయాన్ని తాము ఎన్నటికీ మరిచిపోలేమన్నారు. డ్వాక్రా రుణాల రద్దు మీద మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న డ్వాక్రా సంఘాలకు బాబు చేసిన సహాయం కొత్త ఊపిరి ఇచ్చిందన్నారు.
సీఎంను కలిసిన వారిలో వినుకొండ రైతు నేతలు వంకాయలపాటి పేరయ్య, వినుకొండ ఎంపీటీసీ, శ్రీనివాస రావు, నూజెళ్ల రైతు జగ్గారావు, కె వెంకటేశ్వర రావు, ఎస్కే మౌలాలీ, టీ యలమంద, ఈశ్వరయ్య తదితరులు ఉన్నారు. సిఎను కలిసిన డ్వాక్రా మహిళల్లో.. వినుకొండ మహిళా సంఘ నేత ఆదిలక్ష్మి, డ్వాక్రా సంఘాల అధ్యక్షులు స్రవంతి, విజయరాణి, అంజమ్మ, లక్ష్మీ, శ్రీదేవి, లక్ష్మీ, శివకుమారి, వెంకటకోటమ్మ తదితరులు ఉన్నారు. సీఎంకు డ్వాక్రా మహిళలు సన్నానం చేశారు.