వైఎస్కు జగన్, షర్మిల సహా ఫ్యామిలీ నివాళి
కడప: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి కడప జిల్లా ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద వద్ద మంగళవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సహా కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా వైయస్ సతీమణి విజయమ్మ, కుమారుడు జగన్, కోడలు వైయస్ భారతి, కూతురు షర్మిల ఇతర కటుంబ సభ్యులతో నివాళులు అర్పించారు.
వైయస్ కుటుంబ సభ్యులతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కూడా వైయస్ సమాధి వద్ద అంజలి ఘటించారు. వైయస్కు నివాళులు అర్పించినవారిలో వైయస్ వివేకానంద రెడ్డి, వైయస్ విమలమ్మ, వైయస్ సుధాకర్ రెడ్డి, వైయస్ పురుషోత్తమ రెడ్డి, వైయస్ ప్రకాష్ రెడ్డి ఉన్నారు.
బ్రదర్ అనిల్ కుమార్, కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు తదితరులు కూడా వైయస్కు నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైయస్ వర్ధంతి సందర్భంగా ఘాట్ను ప్రత్యేకంగా అలంకరించారు. అభిమానులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.
వైయస్ వర్ధంతి సందర్భంగా వివిధ జిల్లాల్లో కూడా కార్యక్రమాలను చేపట్టారు. పులివెందుల శాసనసభ నియోజకవర్గంలో అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.