స్పీకర్పై అవిశ్వాసానికి వైయస్ జగన్ మల్లగుల్లాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మల్లగుల్లాలు పడుతున్నారు. స్పీకర్ వైఖరి మారకపోతే అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉన్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభా పక్షం ఉప నేత జ్యోతుల నెహ్రూ చెప్పారు.
అయితే, జగన్ మాత్రం నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. స్పీకర్పై అవిశ్వాసం పెట్టే విషయంలో పార్టీ శాసనసభ్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సభ్యులు పెట్టాలని, మరికొందరు వద్దంటున్నట్లు సమాచారం. దీంతో ఆయన ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు.
శాసనసభలో శాంతిభద్రతలపై జరుగుతున్న చర్చలో అధికారం, ప్రతిపక్షం మధ్య తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. చర్చ సందర్భంగా స్పీకర్ కోడెల తమ పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపించింది.
స్పీకర్ తీరును నిరసిస్తూ జగన్ సహా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు శనివారం అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఆ తర్వాత సమావేశమైన శాసనసభ్యులు స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టే విషయంపై చర్చించారు. ఏ నిర్ణయమూ తీసుకోకుండానే సమావేశం ముగిసింది.