తెరపైకి మళ్లీ వైయస్ మృతి: వైయస్ జగన్ అనుమానం
కడప: వైయస్ రాజశేఖర రెడ్డి మృతిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మరోసారి తెర మీదికి తెచ్చారు. వైయస్ మృతి వెనుక కుట్ర అంటూ ఉప ఎన్నికల సమయంలో అనుమానాలు వ్యక్తం చేసిన వైయస్ జనగ్ సార్వత్రిక ఎన్నికల వేళ మళ్లీ తెర మీదికి తెచ్చారు. "వైఎస్ మృతి చెందిన హెలికాప్టర్ ప్రమాద స్థలాన్ని, హెలికాప్టర్ శకలాలను చూసిన సమయంలో ఆ ప్రమాదం కుళ్లు కుతంత్రాలతో ఎవరో చేయించారనే అనుమానాలు రేకెత్తించాయి'' అని జగన్ అన్నారు. పులివెందుల అసెంబ్లీ స్థానానికి గురువారం ఆయన నామినేషన్ వేశారు.
ఇంటి దగ్గర నుంచి నామినేషన్ కేంద్రం వరకూ భారీ ర్యాలీగా వెళ్లి మూడు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా పూలంగళ్ల కూడలిలో ప్రసంగించారు. మరో 20 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికల్లో పులివెందుల ప్రజలు మీరందరూ ఆశీర్వదిస్తే మీ కొడుకు ముఖ్యమంత్రి అవుతాడని ఆయన అన్నారు. రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా తన తండ్రి లేని లోటు స్పష్టంగా కనిపించిందని అన్నారు.
రెండోసారి ముఖ్యమంత్రి అయిన అనంతరం రెండు నెలలకే మృతిచెందారని గుర్తు చేస్తూ, వైఎస్ మృతిని, కుట్రకోణాన్ని ప్రస్తావించారు. రాజకీయంగా ఎదుగుతున్నాననే కారణంగానే తనను జైలుకు సైతం పంపారని ఆరోపించారు. భ్రష్టుపట్టిన రాజకీయాలను సమూలంగా మార్చాలంటే వైఎస్ కలలుగన్న స్వరాజ్యాన్ని తీసుకురావాలన్నారు.
వైయస్ మృతితో ఆగిన ప్రాజెక్టులన్నింటినీ తాను పూర్తి చేస్తానన్నారు. "నన్ను, ఎంపీ అభ్యర్థి అవినాష్రెడ్డిని ఆశీర్వదించండి'' అని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, గంగిరెడ్డి, వైఎస్ ప్రకాష్రెడ్డి, వైఎస్ మనోహరరెడ్డి, శివప్రకాష్రెడ్డి తదితరులు ఉన్నారు.