ఎందుకిలా... ఏమిటి?: జగన్ ఆరా తీశారు, అసంతృప్తి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన పలు అంశాల పైన ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల గెలుపోటముల పైన నేతలతో మాట్లాడారు. అదే సమయంలో ఇటీవల రుణమాఫీ అంశానికి సంబంధించి నిరసనలు పలుచోట్ల ఆశించినంత లేకపోవడంపై జగన్ ఆసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం.
ప్రజా సమస్యల పైన తెలుగుదేశం ప్రభుత్వం పైన పోరాడాలని జగన్ నాయకులకు సూచించారు. సమస్యల పైన ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ ఇవ్వాలన్నారు. స్థానిక ఎన్నికల్లో పలు జిల్లాల్లో మెజార్టీ ఉన్నప్పటికీ ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ స్థానాలు దక్కక పోవడం పైన ఆయన ఆరా తీశారు.
ఇటీవల రుణమాఫీకి ఏపీ ప్రభుత్వం పరిమితి విధించడంపై ఇచ్చిన మూడురోజుల నిరసనలకు పలుచోట్ల ఆశించినంత స్పందన రాలేదని జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. అయితే, హడావుడిగా దానిని ప్రకటించడం వల్లనే అలా జరిగిందని నేతలు వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
వీటితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులతో అరకు ఎంపీ కొత్తపల్లి గీత కలవడం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల అనంతరం ఎస్పీవై రెడ్డి టీడీపీ వైపు మొగ్గారు. బుట్టా రేణుక కూడా సైకిల్ ఎక్కుదామనుకున్నప్పటికీ ఆ తర్వాత వెనక్కి తగ్గారు. ఇప్పుడు గీత టీడీపీ వైపు మొగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలోని పరిస్థితి పైన జగన్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఎవరైనా పార్టీని వీడే అవకాశాలున్నాయా? అనే అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.