జగన్ పార్టీ ఉండదు: జెసి దివాకర్, రాజధానిపై సుజన
హైదరాబాద్/విజయవాడ: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మరో ఆరు నెలల్లో జగన్మోన్ రెడ్డి పార్టీ ఉండదని ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్లపాటు జగన్ బయట ఉండే అవకాశం లేదని, ఆయనపైన ఉన్న 12 కేసుల్లో ఒకటి, రెండు కేసుల్లోనైనా జైలుకెళ్తారని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి బయట ఉన్నప్పుడు ఆయన పార్టీ నేతలు వెళ్లిపోతున్నారన్న జెసి, ఆయన జైలుకెళ్తే పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుందని చెబితే జరిగిందని, ఇప్పుడు జగన్ పార్టీ ఉండదని చెబుతున్నానని అది కూడా జరుగుతుందని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అత్యంత లాభపడేది సీమ ప్రాంతమేనని అన్నారు. పోలవరంపై జగన్మోహన్ రెడ్డి తన వైఖరి చెప్పాలని జెసి దివాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం పోలవరంపై వివాదం చేయడం సరికాదన్నారు. మాగంటి బాబుపై దాడి చేసి తిరిగి ఆయనపైనే కేసు పెట్టారని జెసి ఆరోపించారు. కుక్కనూరులో కలెక్టర్ పర్యటనను వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. ముంపు మండలాల విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి మాట్లాడటం లేదని విమర్శించారు.
అనుకూలంగా ఉన్న చోటే రాజధాని: సుజనా చౌదరి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అనుకూలమైతే అక్కడే నిర్మాణం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ ఎంపి సుజనా చౌదరి అన్నారు. శనివారం విజయవాడలో టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారవుతోందని చెప్పారు. దానిని వెబ్సైట్లో ఉంచి ప్రజాభిప్రాయం సేకరిస్తామన్నారు.
అదేవిధంగా రైతు రుణమాఫీపై ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని తాజా సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. ప్రత్యేక హోదాపై అనుమానాలు అవసరం లేదని సుజనాచౌదరి చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై భేటీలో చర్చించినట్లు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలపై కూడా సమావేశంలో చర్చించామని తెలిపారు.