రెండు నెలల్లోనే చంద్రబాబుపై వ్యతిరేకత: వైయస్ జగన్
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై రెండేళ్లలో రావాల్సిన వ్యతిరేకత రెండు నెలల్లోనే వచ్చిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో ఆయన పార్టీ సమీక్షా సమావేశాన్ని శుక్రవారం కూడా నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ నేతల దౌర్జన్యాలకు ఎప్పటికప్పుడు స్పందించాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. బాధితులకు భరోసా ఇవ్వాలని ఆయన పార్టీ నాయకులకు సూచిచారు. సాధ్యం కానీ వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం మోసాలను ప్రజలు గ్రహించారని ఆయన అన్నారు.
చంద్రబాబు మోసాలను గ్రహించిన ప్రజలు ఇప్పుడు తమ వైపు చూస్తున్నారని, వారికి అండగా ఉద్యమాలు చేద్దామని ఆయన పార్టీ నాయకులతో అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలపై అక్టోబర్ 16వ తేదీన మండల కార్యాలయాల ముట్టడికి జగన్ పిలుపునిచ్చారు.
కాగా, జగన్ గురువారంనాడు అనంతపురం జిల్లాకు సంబంధించి నియోజకవర్గాలవారీగా సమీక్షలు నిర్వహించారు. తమ పార్టీ ఓటమికి చంద్రబాబు అబద్ధాలు చెప్పడం, ఓ వర్గం మీడియా కూడా అబద్ధాలు ప్రచారం చేయడం కారణమని ఆయన అన్నారు.