కోర్టుకు జగన్, విజయసాయి: అక్టోబర్ 21కి వాయిదా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఆస్తుల కేసు అంశం పైన కోర్టులో విచారణ జరుగుతోంది. ఇందుకోసం జగన్తో పాటు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, విజయ సాయి రెడ్డిలు కోర్టుకు హాజరయ్యారు. కోర్టు విచారణను అక్టోబర్ 21వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కేసులో పలు అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని, కుట్రల ద్వారా అక్రమంగా ఆర్జించి సంపన్నులయ్యారని, దానివల్ల ప్రభుత్వం నష్టపోయిందని సిబిఐ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
తండ్రి ముఖ్యమంత్రిగా ఉండడంతో ప్రభుత్వం ద్వారా ప్రయోజనం పొందిన వ్యక్తుల నుంచి ముడుపుల వసూళ్లకే జగన్ జగతి పబ్లికేషన్స్ వాటా ధరను పెంచారని సిబిఐ వాదించింది.
అత్యల్ప కాలంలో వేల కోట్ల రూపాయలు సక్రమంగా ఆర్జించి ఉంటే దాన్ని హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో పాఠ్యాంశంగా పెట్టవచ్చునని, అయితే దర్యాప్తులో ఇది అక్రమార్జన అని తేలిందని సిబిఐ వాదించింది. జగన్ ఆక్రమాస్తుల వ్యవహారంలో మొదటి అభియోగ పత్రానికి చెందిన అరబిందో, హెటిరో కేసులో అభియోగాల నమోదు ప్రక్రియ, హెటిరో డిశ్చార్జీ పిటిషన్లపై సిబిఐ కోర్టు న్యాయమూర్తి ఎన్ బాలయోగి గత బుధవారం విచారణ చేపట్టారు.