విజయమ్మ ఆస్తులు రూ2 కోట్లు, తగ్గిన జగన్ ఆస్తులు
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ తన ఆస్తులను రూ 2.19 కోట్లుగా ప్రకటించారు. విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆమె గురువారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె నామినేషన్తో పాటు ఆస్తుల అఫిడవిట్ను ఎన్నికల అధికారికి సమర్పించారు.
నగదు రూ. 17,77,343గా పేర్కొన్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో రూ. 56,28,690 చూపించారు. పలు బ్యాంకుల్లో సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లో రూ 15,36,340 ఉన్నట్టు చూపించారు. 1176 గ్రాముల బంగారం, ఆభరణాల విలువను రూ 48,97,633గా పేర్కొన్నారు.
మరికొన్ని ఆస్తులుగా రూ.42,427 చూపించారు. సరస్వతి పవర్స్లో రూ 10 ముఖవిలువ కలిగిన 3,52,500 షేర్లను ప్రకటించారు. ఇక స్థిరాస్తుల విషయానికొస్తే వేంపల్లి మండలం ఇడుపుల పాయలో 39.52 ఎకరాల వ్యవసాయ భూమి, పులివెందులలో రెండు భవనాలు కలిపి మొత్తం విలువను రూ.45,31,700గా అఫిడవిట్లో పేర్కొన్నారు.
కాగా, విజయమ్మ విశాఖపట్నం లోకసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. కుమార్తె షర్మిల, అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్తో పాటు వైయస్సార్ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణతో కలిసి నామినేషన్ కేంద్రంలోకి వెళ్లిన విజయమ్మ రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
తగ్గిన జగన్ ఆస్తి
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాని నామినేషన్ దాఖలు చేసిన వైయస్ జగన్ ఆస్తి గతంలోకంటే తగ్గింది.అఫిడవిట్లో తనకు మొత్తం రూ.416కోట్ల ఆస్తులున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన భార్య వైఎస్ భారతి పేరు మీద రూ.57,75,56,006లు ఉన్నట్లు తెలిపారు. కాగా, 2011 సంవత్సరంలో ఉప ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తనకు రూ.445కోట్లు ఉన్నట్లు జగన్ పేర్కొన్నారు.