టీలో జగన్ తట్ట సర్దేస్తున్నారా: షర్మిల ఎక్కడ, నో..?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్ పార్టీగానే కొనసాగనుందా? తెలంగాణలో తట్టా... బుట్టా సర్దుకుంటున్నారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. మెదక్ లోకసభ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఇంకా ఆలోచించలేదని, తమ ఫోకస్ అంతా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల పైననే ఉందని రెండు రోజుల క్రితం వైయస్ జగన్ చెప్పిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఆయన వ్యాఖ్యల పైన రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణలో ప్రజా సమస్యలతో పాటు, విద్యార్థుల ఫీజు రీయింబర్సుమెంట్స్ ఇబ్బందుల గురించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించేలేదు. తెలంగాణలో పార్టీని పునరుద్దరించే పరిస్థితి, ఆలోచన ఉంటే సంస్థాగత నిర్మాణం పైన నాయకత్వం దృష్టి సారించేదని, ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి కదలిక లేనట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
ఈ కారణంగానే పార్టీలో మిగిలిన కొద్దిమంది తెలంగాణ నేతలు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేశారంటున్నారు. ఏపీకి సంబంధించి పార్టీ ప్రక్షాళన దిశగా రాష్ట్రస్థాయి ప్రధాన కార్యదర్శులను కొత్తగా నియమించడంతో పాటు, జిల్లాల అధ్యక్షులను మార్చిన అధినేత.. తెలంగాణపై ఎలాంటి ఏర్పాట్లు చేపట్టలేదని అంటున్నారు. ఏపీ వరకు నియోజకవర్గాల బధ్యతలను నియమించేందుకు కసరత్తు చేస్తున్నారని, తెలంగాణలో కనీసం జిల్లా కమిటీల పైన కూడా దృష్టి సారించడం లేదంటున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు ఇప్పటికే తెరాస వైపు చూస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది.
షర్మిలకు నో..!
తెలంగాణ బాధ్యతను జగన్ తన సోదరి షర్మిలకు అప్పగిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, ఇంత వరకు అలాంటి ఏర్పాట్లు ఏమీ జరగలేదంటున్నారు. ఎన్నికలకు ముందు ప్రచారం నిర్వహించిన షర్మిల, ఇప్పుడు రాజకీయ కార్యకలాపాల్లో కనిపించడం లేదు.
లోటస్ పాండుకు కార్యాలయం
జూబ్లీహిల్స్లోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యాలయం ఉన్న భవనాన్ని సెప్టెంబరు 8 నాటికి ఖాళీ చేసేందుకు ఆ పార్టీ నాయకత్వం అ భవనం యాజమాన్యంతో అంగీకారానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్యాలయం తరలిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావిస్తున్న ఆ పార్టీ... కొద్ది రోజుల అనంతరం ఖాళీ చేయనుందట. అద్దె, కార్యాలయ నిర్వహణకు రూ.10 లక్షల వరకు నెలకు అవుతుందంట. ఈ నేపథ్యంలో లోటస్ పాండులోని జగన్ నివాసానికి మార్చనున్నారట.