వైయస్ హయాంలోని భూములు కక్కిస్తాం: కెసిఆర్
ఆదిలాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుతవ హయాంలో హైదరాబాద్లోని లక్షలాది ఎకరాలను సీమాంధ్రులు చౌకగా కాజేశారనిస అవన్నీ కక్కిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖర రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అవినీతిని పాతరేస్తామని, కబ్జాపెట్టిన భూములన్నింటిని వెనక్కి తీసుకుంటామని కెసిఆర్ హెచ్చరించారు. 'సెటిలర్ల'ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్న తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ను తోసిపుచ్చారు.
పొన్నాల మాటల వెనక కరుడుగట్టిన సమైక్యవాది కెవిపి హస్తం ఉన్నదని దుయ్యబట్టారు. కెవిపి కనుసన్నల్లో పని చేస్తూ, ఆయన ఇచ్చిన ధనంతో ప్రచారం చేసుకుంటున్నారని, అలాంటివారు తనపై విమర్శలు చేయడమా అని, ఇది పొన్నాల దిగజారు డుతనానికి నిదర్శనమని కెసిఆర్ అన్నారు. ఉద్యోగులకు ఆప్షన్లు వద్దన్న తన వ్యాఖ్యలపై పొన్నాల అంత అతిగా స్పందించడం విడ్డూరమని అన్నారు.
సీమాంద్రుల పాలనలో నిర్లక్ష్యానికి గురయిన బాసర క్షేత్రాన్ని టిటిడిలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లో కెసిఆర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో ఈ ప్రాంత పెత్తనం కొనసాగాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ప్రస్తు తం ఓట్ల కోసం మాయగాళ్లు వస్తున్నారని, వారిని ఎవరూ నమ్మ వద్దన్నారు.
తెలంగాణ ప్రజలను ఆగంచేసి సీమాంధ్ర నేతలు తెర వెనుక చక్రం తిప్పేందుకోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, బీజేపీ అగ్రనేత వెంకయ్య కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ సీమాంధ్రులే పెత్తనం చెలాయిస్తారన్నారు. ఆంధ్రలో అధికారంలోకి వస్తానని కలలుకంటూ తెలంగాణలోనూ చంద్రబాబు దుకాణం పెడుతున్నారని అన్నారు.
తాము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాలో ఒక ఎకరం భూమి కూడా నిరుపయోగం కాకుండా చూస్తామన్నారు. భూములన్నీ సాగులోకి తెస్తామని, తెలంగాణను అన్నపూర్ణగా తీర్చిదిద్దుతామనిసస దీని కోసం పది జిల్లాలలో మీడియం ఇరిగేషన్ కింద షార్ట్ గెస్టేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తామని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను ఇక ఆపడం ఎవరి తరంకాదని, ప్రాజెక్టుల వద్ద తానే కుర్చీ వేసుకుని కూర్చుని పనులు పూర్తి చేయిస్తానని అన్నారు.