టీడీపీ ఆఫీస్లో లోకేష్కు జగన్ పార్టీ కార్యకర్తల షాక్!
హైదరాబాద్: పార్టీ కార్యకర్తలను ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిని నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. సాయం కోసం రోజుకు పలువురు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్కు వచ్చి కలుస్తున్నారు. సాయం కోరుతున్నారు. అయితే, లోకేష్ వద్దకు ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కూడా వచ్చారట. దీంతో ఆశ్చర్యపోవడం ఆయన వంతయిందట.
కార్యకర్తలను ఆదుకునేందుకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. దీనికి ఇప్పటికే మూడు కోట్లకు పైగా వచ్చాయట. చంద్రబాబు పాలనలో బిజీగా ఉంటుండటంతో.. లోకేష్ ప్రతిరోజు పార్టీ కార్యాలయానికి ఠంచన్గా వస్తున్నారట. తనను కలుస్తున్న కార్యకర్తలతో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు లోకేష్ను వేలాది మంది కార్యకర్తలు కలిశారు.
తనను కలుస్తున్న కార్యకర్తలు ఇచ్చే దరఖాస్తులను పరిశీలించడంతో పాటు ఆ డేటాను కంప్యూటర్లోకి ఎక్కిస్తున్నారట. అర్హులైన వారికి ఉపాధి కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్యం బాగా లేకుంటే ఆసుపత్రులలో చికిత్స అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కార్యకర్తలను ఎన్టీఆర్ మెమోరియల్ పాఠశాలలో చేర్చుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. ఇటీవల తమకు సాయం కావాలంటూ ఎన్టీఆర్ భవన్కు నలుగురు వచ్చారట. వారికి లోకేష్ హామీ ఇచ్చారట కూడా. అయితే తర్వాత చేసిన పరిశీలనలో వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అని తెలియడంతో ఆశ్చర్యపోవడం ఆయన వంతయిందట.