టీడీపీలోకి జగన్ పార్టీ ఎంపీ, ప్లాన్?: బాబుతో గీత భేటీ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన మరో ఎంపీ తెలుగుదేశం పార్టీలో చేరే సూచనలు కనిపిస్తున్నాయి. అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. చంద్రబాబు నివాసానికి వచ్చిన ఆమె సుమారు నలభై నిమషాలపాటు ఆయనతో భేటీ అయ్యారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అంతర్గత పరిస్ధితులు, పార్టీ నాయకుల తీరుపై ఆమె కొంతకాలంగా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. టీడీపీలో చేరే ఆలోచనలో గీత ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె బాబును కలవడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది.
బాబుతో భేటీ అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. అయితే, అరకు నియోజకవర్గ అభివృద్ధికి సాయం చేయాలని కోరేందుకే తాను సీఎంను కలిసినట్లు ఆమె తర్వాత వెల్లడించారు.
కొత్తపల్లి గీత టీడీపీలో చేరడం లాంఛనమే అంటున్నారు. అయితే, పార్టీ ఫిరాయింపుల ఫిర్యాదును ఎదుర్కోవడం, అనర్హత పిటిషన్ వంటి వాటిని ఎదుర్కొనే పరిస్థితి రాకుండా ఉండేందుకు అధికారికంగా టీడీపీలోకి రాకపోవచ్చునని చెబుతున్నారు. టీడీపీతో సన్నిహితంగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి గతంలోనే టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆయన బాటలోనే గీత కూడా ప్రయాణిస్తున్నట్లుగా కనిపిస్తోంది.