గందరగోళం: బాబుపై వైవీ, జైలుని సందర్శించిన నాయిని
హైదరాబాద్/ఒంగోలు: రైతు రుణమాఫీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందరినీ గందరగోళానికి గురి చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒంగోలు లోకసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి సోమవారం ఆరోపించారు. చంద్రబాబు ప్రజలను గందరగోళంలోకి నెట్టడం సరికాదన్నారు.
ఆర్బీఐ రీషెడ్యూలుకు అనుమతి ఇస్తే, చంద్రబాబు రుణమాఫీ చేశానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అదెలా సాధ్యమో ప్రజలకు స్పష్టత ఇవ్వకుంటే మరో ఉద్యమం పుట్టుకొస్తుందని హెచ్చరించారు. వ్యవసాయ రుణాల పైన టీడీపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు.
అనుమతించిన పరిమితికి మించి పొగాకు పండిస్తే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న పెనాల్టీ విధానంపై ఆయన మాట్లాడుతూ.. ఇలా పెనాల్టీ విధించే నిబంధనను రద్దు చేయాలని కేంద్ర వాణిజ్యమంత్రిని కోరతామన్నారు.
చర్లపల్లి జైలును సందర్శించిన నాయిని
తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి సోమవారం చర్లపల్లి జైలును సందర్శించారు. ఈ సందర్భంగా జైలులో బియ్యం, దుప్పట్లు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ... జైళ్లలో వైద్యుల కొరత తీరుస్తామని, ఖైదీల భోజనంలో నాణ్యత పెంచుతామని తెలిపారు.
జైళ్ల సంస్కరణలకు పెద్దపీట వేస్తామన్నారు. అభివృద్ధికోసం దేశంలోని జైళ్లకు ప్రత్యేక టీమ్లను పంపిస్తామని చెప్పారు. క్షమాభిక్షకు అర్హులైన ఖైదీల విడుదలకు కసరత్తు చేస్తున్నామని, దీనిపై ముఖ్యమంత్రితో చర్చిస్తామని హోంమంత్రి పేర్కొన్నారు. అధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.